Aviation: భారత గగనతలంపై పాక్ విమానాల నిషేధం పొడిగింపు

by S Gopi |

జూన్ 23 వరకు ఆంక్షలు కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ ఆదేశించింది.

Aviation: భారత గగనతలంపై పాక్ విమానాల నిషేధం పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల కారణంగా మన దేశ గగనతల మార్గాలను కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ విమానయాన సంస్థలు భారత భూభాగంపై ఎగరకుండా నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విధించిన నిషేధం శుక్రవారంతో ముగియనుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా జూన్ 23 వరకు ఆంక్షలు కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ ఆదేశించింది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటీసు టు ఎయిర్‌మెన్ (నోటమ్) ప్రకారం, పాకిస్తాన్‌లో రిజిస్టర్ చేసిన విమానాలు, పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ లేదా ఆపరేటర్లు యాజమాన్యంలో, నిర్వహించే లేదా లీజుకు తీసుకున్న విమానాలు జూన్ 23 వరకు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం అమలవుతుంది. ఈ ఆంక్షలు పాకిస్తాన్ సైనిక విమానాలకు కూడా వర్తిస్తుందని నోటీసులో స్పష్టం చేసింది. భారత్ నిర్ణయానికి సుమారు గంట క్రితం, పాకిస్తాన్ కూడా తమ గగనతలంపై భారత విమానాలు, క్యారియర్‌లకు నిషేధాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఇది జూన్ 24 వరకు అమల్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ నిబంధనల ప్రకారం.. ఏ దేశమైనా సరే నెల రోజుల కంటే ఎక్కువ కాలం గగనతల నిషేధాన్ని విధించడం కుదరదు.

Next Story