Hormuz : హర్ముజ్ జలసంధిని మూసివేస్తే భారత్ కు జరిగేది ఇదే.. వెల్లడించిన కేంద్రమంత్రి

by Naga Rani Yarlagadda |

ఇరాన్‌ అణుస్థావరాలపై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.

Hormuz : హర్ముజ్ జలసంధిని మూసివేస్తే భారత్ కు జరిగేది ఇదే.. వెల్లడించిన కేంద్రమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌ అణుస్థావరాలపై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేయాలని ఇరాన్‌ పార్లమెంట్‌ (Iran Parliament) ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ విషయంలో తుది నిర్ణయం ఆ దేశ భద్రతా మండలి తీసుకోవాల్సి ఉంది.

ఇరాన్‌ నిర్ణయం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపనుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి (Hardeep Singh Puri) ఈ నేపథ్యంలో స్పందించారు. ‘‘గత రెండు వారాలుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలను మేము తీవ్రంగా గమనిస్తున్నాం. ప్రధాని మోదీ నాయకత్వంలో.. భారత్‌ చమురు సరఫరాల కోసం వేరువేరు మార్గాలను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం హర్మూజ్‌ జలసంధి మీదే పూర్తిగా ఆధారపడుతున్నాం అని చెప్పలేం. మన చమురు కంపెనీల వద్ద చాలినన్ని నిల్వలు ఉన్నాయి. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.’’ అని మంత్రి పేర్కొన్నారు.

హర్మూజ్‌ జలసంధి ఒక ముఖ్యమైన సముద్ర మార్గం. ఇది ఒమన్‌, ఇరాన్‌ మధ్య విస్తరించి ఉంది. ప్రపంచ దేశాలకు రోజుకు సుమారు 2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఈ మార్గం ద్వారా వెళ్తోంది. ఇది ప్రపంచ మొత్తం ముడి చమురు వినియోగంలో సుమారు 21%. అలాగే ద్రవరూప సహజవాయువు (LNG) సరఫరాలో కూడా 20% హర్మూజ్‌ జలసంధి ద్వారా మాత్రమే జరుగుతుంది.

భారత్‌ రోజువారీ చమురు అవసరాల్లో సుమారు 85% సౌదీ అరేబియా, ఇరాక్‌, యూఏఈ లాంటి గల్ఫ్‌ దేశాల నుంచే వస్తుంది. ఖతార్‌ నుండి వచ్చే ఎల్‌ఎన్‌జీ సరఫరా కూడా ఇదే మార్గంలో జరుగుతుంది. హర్మూజ్‌ మూసివేస్తే భారత్‌లో చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉన్నా, కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి హమీ ఇచ్చారు.

twitter link

Next Story