ఫ్రెంచ్ జర్నలిస్టుకు భారత్ నోటీసులు: కారణమేంటి?

by Dishanational2 |
ఫ్రెంచ్ జర్నలిస్టుకు భారత్ నోటీసులు: కారణమేంటి?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో ఉన్న ఫ్రెంచ్ జర్నలిస్టు వెనెస్సా డౌగ్నాక్‌కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. డౌగ్నాక్ పని తీరు జాతీయ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పేర్కొంది. భారత్ పట్ల ప్రతికూల అవగాహనను పెంపొందించేలా ఉన్నాయని ఆరోపించింది. ‘వెనెస్సా పాత్రికేయ కార్యకలాపాలు హానికరమైనవి. అవి భారతదేశంపై పక్షపాత భావనను సృష్టించేలా ఉన్నాయి. అంతేగాక శాంతికి భంగం కలిగించే అవకాశం ఉంది’ అని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం పేర్కొంది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును ఎందుకు ఉపసంహరించుకోకూడదో వెనెస్సా వివరణ ఇవ్వాలని కోరింది. శుక్రవారం జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌కు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

రెండు దశాబ్దాలుగా భారత్‌లోనే వెనెస్సా

గ్రామీణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నక్సలైట్ల తిరుగుబాటు వంటి సమస్యలపై డౌగ్నాక్ కథనాలు రాసినట్టు తెలుస్తోంది. డౌగ్నాక్ నివేదికలు అన్ని తప్పు అని వాటి ద్వారా సమాజంలో రుగ్మతలు రేకెత్తే ప్రమాదం ఉందని నోటీసులో పేర్కొన్నారు. అయితే వీక్లీ మ్యాగజైన్ లీ పాయింట్‌తో సహా పలు ఫ్రెంచ్ భాషా ప్రచురణలకు పాత్రికేయురాలిగా పనిచేస్తున్న డౌగ్నాక్.. 22ఏళ్లుగా భారత్‌లోనే ఉన్నారు. ఈ సమయంలో అనేక సమస్యలపై ఆమె నివేదికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల తర్వాత నోటీసులు జారీ చేయడం గమనార్హం.

భారత్‌కు విఘాతం కల్గించే చర్యల్లో ఎప్పుడూ పాల్గొనలేదు: వెనెస్సా డౌగ్నాక్‌

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు రావడంపై జర్నలిస్టు వెనెస్సా డౌగ్నాక్‌ స్పందించారు. ‘భారత ప్రభుత్వం నుంచి నాకు నోటీసు వచ్చింది. కానీ నోటీసులో పేర్కొన్న ఆరోపణలన్నీ అవాస్తవం. వాటన్నింటినీ తిరస్కరిస్తున్నా. భారతదేశం నా ఇల్లు, నేను గాఢంగా ప్రేమించే, గౌరవించే దేశం. భారతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యల్లో ఎప్పుడూ పాల్గొనలేదు’ అని ఓ ప్రకటనలో తెలిపారు.


Next Story

Most Viewed