ఇజ్రాయెల్‌, భారత్ మధ్య విమాన సర్వీసులు బంద్

by Dishanational1 |
ఇజ్రాయెల్‌, భారత్ మధ్య విమాన సర్వీసులు బంద్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై ఇరాన్ డాడి కారణంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా వేడెక్కాయి. శనివారం రాత్రి ఇరాన్ ప్రతీకారంగా 200 డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెలీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలో క్లిష్టమైన పరిస్థితుల కారణంగా భారత విమానయాన సంస్థలు ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్, భారత్ మధ్య విమానాల రాకపోకలను నిలిపేయాలని భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఇజ్రాయెల్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలాను నిలిపేయవచ్చని సంబంధింత వర్గాలు ఏఎన్ఐకి తెలిపాయి. శనివారం టెల్ అవీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. తిరిగి టెల్ అవీవ్ నుంచి భారత్‌కు తిరుగు ప్రయాణం చేయనుంది. రెండు ప్రధాన విమానయాన సంస్థలు ఎల్అల్, ఎయిర్ఇండియా ఇజ్రాయెల్, భారత్ మధ్య కమర్షియల్ విమానాలను నడుపుతున్నాయి. దేశీయ విమానయాన సంస్థలు ఎయిర్ఇండియా, విస్తారా ఇరాన్ గగనతలం నుంచి విమానాలను నడపడం ఆపేస్తున్నట్టు ప్రకటించాయి. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని యూరప్, యూఎస్‌లకు విమానాలను నడుపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారతీయ విమానయాన సంస్థలు యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు విమాన రూట్లలో మార్పు చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇరాన్ ప్రయాణానికి దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది.

Next Story

Most Viewed