భారత్ పాకిస్థాన్‌తో కాదు.. ఉగ్రవాదులతో యుద్ధం చేస్తుంది: వినయ్ క్వాత్ర

by D.Reddy |
భారత్ పాకిస్థాన్‌తో కాదు.. ఉగ్రవాదులతో యుద్ధం చేస్తుంది: వినయ్ క్వాత్ర
X

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. మొత్తం 9 ప్రాంతాల్లో మెరుపుదాడులు చేసి 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తారాస్థాయికి చేరి ప్రత్యేక్ష యుద్ధానికి దారితీశాయి. ఈ క్రమంలో అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్ర (Vinay kwatra) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించటమే భారత్ లక్ష్యమని అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్ధతు ఇస్తోందని తీవ్రంగా మండిపడ్డారు.

భారత్ యుద్ధం చేసేది పాకిస్థాన్‌తో కాదని, ఉగ్రవాదంతో యుద్ధం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత్ దాడులు చేశాయని క్వాత్రా తెలిపారు. ఇందులో పౌరులు, సైనిక స్థావరాలు, ఆర్థిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటం తమ ఉద్దేశ్యం కాదన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రపంచానికి తాము ఉగ్రవాదుల పక్షాన ఉన్నామని సంకేతం ఇస్తోందని, ఇది మానవతా విలువలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఇదే ఉద్రిక్తతల బీజం అని క్వాత్ర వ్యాఖ్యానించారు. ఇది మామూలు ఘటన కాదు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దారుణం అని ఆయన అన్నారు.

అలాగే, పాకిస్థాన్ ఎప్పుడూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ వచ్చిందని, 9/11, 26/11 ముంబయి దాడుల నుంచే ఇది స్పష్టంగా కనిపిస్తోందని క్వాత్ర అన్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తోందని విమర్శించారు. అంతేకాదు, జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం భారత్‌లో భాగమేనని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌దే అని స్పష్టం చేశారు. ఇప్పుడు పాక్ ఆక్రమించిన ప్రాంతాన్ని తిరిగి పొందడమే ఏకైక సమస్య అని తెలిపారు.



Next Story

Most Viewed