మహమ్మారితో గొప్పగా పోరాడుతున్నాం: మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ

by Web Desk |
మహమ్మారితో గొప్పగా పోరాడుతున్నాం: మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మూడో వేవ్‌లో భారత్ గొప్పగా పోరాడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతూ ఉండడం సానుకూల అంశమని అన్నారు. ఆదివారం ఆయన ఈ ఏడాదిలో తొలిసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. 'భారత్ కరోనా కొత్త‌వేవ్‌పై విజయవంతంగా పోరాడుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 4.5కోట్లకు పైగా పిల్లలు వ్యాక్సిన్ తీసుకోవడం గొప్ప విషయం. కేవలం 3-4 వారాల్లోనే 60 శాతానికి పైగా టీకా తీసుకున్నారు. ఇది కేవలం యువతను రక్షించడమే కాకుండా, వారి చదువులు కొనసాగేందుకు ఉపయోగపడుతుంది' అని అన్నారు. మరో విశేషమేమిటంటే కేవలం 20 రోజుల్లోనే కోటికి పైగా ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారు ప్రికాషన్ డోసు తీసుకున్నారని తెలిపారు. స్వదేశీ వ్యాక్సిన్‌పై మన దేశప్రజలకున్న ఈ నమ్మకం మనకు గొప్ప బలమని ఉద్ఘాటించారు.

జాతీయ చిహ్నాలు పున:స్థాపన

మహాత్మాగాంధీ వర్ధంతిని స్మరిస్తూ ప్రధాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు(జనవరి 30) ప్రతి ఒక్కరికి జాతిపిత నేర్పిన పాఠాలను గుర్తు చేస్తుందన్నారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ డిజిటల్ విగ్రహాన్ని ప్రతిష్టించడం పై దేశవ్యాప్తంగా అందరూ స్వాగతించారని తెలిపారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో దేశం జాతీయ చిహ్నాలను పున:స్థాపన చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకం వద్ద విలీనం చేయడం మనం చూశాం. ఆ భావోద్వేగ సమయంలో దేశంలోని చాలా మంది కళ్లు చెమర్చాయి' అని అన్నారు. స్మారకం వద్ద వెలిగించిన 'అమర్ జవాన్ జ్యోతి' అమరవీరుల అమరత్వానికి చిహ్నమని తనకు కొందరు మాజీ సైనికులు లేఖ రాసినట్లు తెలిపారు. వారి స్ఫూర్తి, భాగస్వామ్యం శాశ్వతమని అని అన్నారు. అవకాశం వచ్చినప్పుడు తప్పక జాతీయ యుద్ధ స్మారక సందర్శించాలని ఆయన కోరారు. సాధారణ పరిస్థితుల్లో అసాధారణమైన పనులు చేసిన అద్భుత నాయకులను గుర్తించి పద్మ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు.

అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు అనేక మంది ఉత్తరాల ద్వారా సలహాలు ఇచ్చారని తెలిపారు. దేశ, విదేశాల నుంచి దాదాపు కోటి మంది పైగా పిల్లలు నుంచి లేఖలు రావడం మరిచిపోలేమని అన్నారు. ఈ ఉత్తరాలు భావితరాలకు భవిష్యత్ పై ఉన్న ముందు చూపును వెల్లడించాయని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తరాల్లో వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మదన్ మోహన్ మాలవియా, మహత్మ గాంధీ, సర్దార్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్, మహరాజా గైక్వాడ్, రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ వంటి ప్రముఖులు విద్యను వ్యాప్తి చేయడంలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు. తమిళనాడులో పాఠశాల అభివృద్ధికి రూ.లక్ష దానం చేసిన తైమ్మల్ గురించి ప్రస్తావించారు. కొబ్బరికాయలు అమ్ముతూ కుటుంబ పోషణ చేసే వ్యక్తి సేవ చేయడం గొప్ప విషయమని అన్నారు. గొప్ప మనసుతో, సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటివి చేస్తారని అన్నారు.

భారత సంస్కృతి పై ఆకర్షణ పెరిగింది

భారతీయ సంస్కృతి విభిన్న రంగులు, ఆధ్యాత్మిక బలం ఎల్లప్పుడూ ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షించాయని అన్నారు. భారత సంస్కృతి పట్ల ఆకర్షణ అమెరికా, కెనడా, దుబాయ్, సింగపూర్, పశ్చిమ యూరోప్, జపాన్‌లో మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికాలో కూడా ఉందని అన్నారు. 2018లో అర్జెంటీనాలో పర్యటించినప్పుడు హస్తినాపూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ సంస్థ 30 బ్రాంచీల తో పాటు, 40 వేల సభ్యులను అర్జెంటీనా తో పాటు ఇతర లాటిన్ దేశాల్లో కలిగి ఉందని తెలిపారు. దీంతో పాటు 12 దేవాలయాలను నిర్వహిస్తుందని వెల్లడించారు. కాగా, ఈ మధ్యనే మధ్యప్రదేశ్‌లో పెంచ్ టైగర్ రిజర్వ్‌లో చనిపోయిన టీ-15 పెద్ద పులి గురించి ప్రస్తావించారు. దేశ ప్రజలు భావోద్వేగంతో టీ-15కు వీడ్కోలు పంపారని అన్నారు. రాష్ట్రపతి బాడీగార్డ్‌ దళంలో సేవలందించి రిటైరయిన గుర్రం విరాట్ సేవలు మరువలేనివని అన్నారు.

Next Story

Most Viewed