భారత్-చైనా సమస్యకు తక్షణ పరిష్కారం అవసరం: న్యూస్ వీక్ మేగజీన్ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ

by Dishanational2 |
భారత్-చైనా సమస్యకు తక్షణ పరిష్కారం అవసరం: న్యూస్ వీక్ మేగజీన్ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-చైనాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడం తక్షణ అవసరమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య సుస్థిర సంబంధాలు ప్రపంచం మొత్తానికి ముఖ్యమైనవని తెలిపారు. అమెరికాకు చెందిన న్యూస్ వీక్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు. సానుకూల భాగస్వామ్య సంబంధాల ద్వారా రెండు దేశాలు తమ సరిహద్దుల్లో శాంతిని పునరుద్దరించుకోవగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ చైనాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు రెండు దేశాలకే గాక ప్రపంచం మొత్తానికి ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. దౌత్య, సైనిక స్థాయిల్లో నిర్మాణాత్మక ద్వైపాక్షిక సంబంధాల ద్వారా సమస్యను పరిష్కరించుకోగలమని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. 2020లో లడఖ్ ప్రాంతంలోని ఎత్తైన గాల్వాన్ లోయలో సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు బాగా క్షీణించిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు మరణించారు.

పాకిస్థాన్‌పై ప్రధాని మోడీ స్పందిస్తూ..నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధానికి అభినందనలు తెలిపారు. ఉగ్రవాదం, హింస లేకుండా శాంతియుత వాతావరణంలో దేశం ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలిపారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అది పాక్ అంతర్గత విషయమని ఆ విషయంలో తాను జోక్యం చేసుకోలేనని స్పష్టం చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌లతో కూడిన క్వాడ్ గ్రూప్ గురించి మాట్లాడిన మోడీ.. ఈ గ్రూప్ ఏ దేశానికి వ్యతిరేకంగా ఉద్దేశించినది కాదని అన్నారు. ఎస్సీవో, బ్రిక్స్ ఇతర అనేక అంతర్జాతీయ కూటముల మాదిరిగానే క్వాడ్ కూడా భాగస్వామ్య ఎజెండాపై పని చేస్తుందని స్పష్టం చేశారు.

శతాబ్దాల త్యాగానికి ప్రతీక రామమందిరం

అయోధ్యలో నిర్మించిన రామమందిరం శతాబ్దాల త్యాగానికి ప్రతీక అని తెలిపారు. రామ్ లల్లా జీవితం మన నాగరికతలో ఆలోచనలు, విలువలు రూపురేఖలను ఏర్పాటు చేసిందని చెప్పారు. రామమందిరం ప్రతి ఒక్కరిలో శ్రీరామునికి ఉన్న గౌరవమైన స్థానాన్ని చూపించిందని కొనియాడారు. ‘శ్రీరాముడు తన జన్మస్థలానికి తిరిగి రావడం చారిత్రాత్మక ఘట్టంగా గుర్తించబడింది. ఇది శతాబ్దాల పట్టుదల, త్యాగానికి పరాకాష్ట. రామ్ లల్లా తిరిగి రావడానికి దేశ ప్రజలు శతాబ్దాలుగా ఓపికగా ఎదురు చూశారు’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ రామమందిరాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed