పంపకాల ముచ్చట్లు.. మహారాష్ట్ర, యూపీలలో పొత్తులపై ‘ఇండియా’ చర్చలు

by Dishanational4 |
పంపకాల ముచ్చట్లు.. మహారాష్ట్ర, యూపీలలో పొత్తులపై ‘ఇండియా’ చర్చలు
X

దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్‌సభ సీట్ల పంపకాలపై కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని మిత్రపక్షాలు మంగళవారం ముంబైలో సమావేశమై సీట్ల సర్దుబాటుపై డిస్కస్ చేశాయి. ఇందులో శివసేన(ఉద్ధవ్) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, రాష్ట్ర కాంగ్రెస్ నుంచి ఒక ప్రతినిధి పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో ఏం చర్చించారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అయితే కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన తమకు 23 సీట్లను కేటాయించాలని శివసేన (ఉద్ధవ్) డిమాండ్ చేస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. మిగిలిన 25 సీట్లలో కాంగ్రెస్, ఎన్సీపీలు సీట్లను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ నివాసంలో ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ సీట్ల సర్దుబాటుపై మీటింగ్ జరిగింది. యూపీలో అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ మీటింగ్‌లో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ ప్రతినిధులు సహా యూపీలోని పలు చిన్న పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాగా, సోమవారం రోజు పంజాబ్, ఢిల్లీలలో సీట్ల పంపకాలపై ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఢిల్లీలో 3, పంజాబ్‌లో 6 స్థానాలకు కాంగ్రెస్‌కు వదులుకునేందుకు ఆప్ సిద్ధమైందని తెలుస్తోంది. దీనికి ప్రతిగా హర్యానా, గుజరాత్, గోవాలలో తమకు సమంజసమైన సంఖ్యలో సీట్లను కేటాయించాలనే ప్రపోజల్‌ను కాంగ్రెస్ ఎదుట ఆప్ పెట్టింది.

Next Story

Most Viewed