జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు: వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

by Dishanational2 |
జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు: వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1నుంచి అమలులోకి రానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం..1860 నాటి భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)-1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 స్థానంలో భారతీయ న్యాయ్ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష-2023, భారతీయ సాక్ష్య అథినియం-2023 చట్టాలు అమలు అవుతాయి. అలాగే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106లోని సబ్ సెక్షన్ (2) అమలును కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మూడు చట్టాలకు గతేడాది పార్లమెంటు ఆమోదంచగా.. డిసెంబర్‌ 25న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. దీంతో అవి చట్టాలుగా మారాయి. దేశంలోని న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చడమే వీటి లక్ష్యమని కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ మూడు చట్టాలు అమల్లోకి వస్తే ఐదేళ్లలో భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనంగా మారుతుందని కేంద్రం భావిస్తోంది. ఇవి ఉగ్రవాదం, హత్యలు, జాతీయ భద్రతకు హాని కలిగించే నేరాలకు శిక్షలను మరింత కఠినతరం చేయనున్నాయి.


Next Story

Most Viewed