సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌‌పై అభిశంసన.. ఉభయ సభల్లో విపక్ష ఎంపీల నోటీసులు

by Kema Shiva Kumar |

భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌‌పై అభిశంసన.. ఉభయ సభల్లో విపక్ష ఎంపీల నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాజకీయ చరిత్రలో సంచలన పరిణామంలో చోటుచేసుకుంది. ఓ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ.. ప్రతిపక్షాలు పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ మేరకు సుమారు 190 మందికి పైగా ఎంపీలు సంతకం చేసిన నోటీసును ఇవాళ ఉభయ సభల్లోనూ సమర్పించారు. ఇండియా కూటమి పార్టీలు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ (CEC Gyanesh Kumar)పై ప్రధానంగా ఏడు ఆరోపణలను నోటీసులో పేర్కొన్నాయి. అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) పేరుతో అసలైన ఓటర్ల పేర్లను తొలగించారని, ఇది ఒక వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జరిగిందని ఆరోపించారు. ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై విచారణను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

అభిశంసన ప్రక్రియ ఇలా..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 (5) ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే తొలగించాలి. అందుకు లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో 50 మంది ఎంపీల సంతకాలు అవసరం. ఇప్పటికే 130 మంది లోక్‌సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. ఒకవేళ స్పీకర్ నోటీసు అంగీకరిస్తే. ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఆరోపణలను పరిశీలిస్తుంది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే, ఉభయ సభల్లోనూ 2/3 వంతు మెజారిటీతో తీర్మానం నెగ్గాల్సి ఉంటుంది.

మరోవైపు విపక్షాల ప్రవేశపెట్టాన అభిశంసన తీర్మానాన్ని అధికార బీజేపీ (BJP) తప్పుబట్టింది. రాజ్యాంగబద్ధమైన సంస్థలను ప్రతిపక్షాలు అప్రదిష్ట పాలు చేస్తున్నాయని, మెజారిటీ లేకపోయినా కేవలం రాజకీయం కోసమే ఇలా తప్పటడుగు వేస్తున్నాయని విమర్శించింది.

Next Story