భారీ వర్షాలు.. మీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి : వాతావరణశాఖ హెచ్చరిక

by Naga Rani Yarlagadda |

ఎండతీవ్రత, తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్న ముంబైవాసులకు భారీ వర్షాలు ఊరటనిస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తోన్న వర్షాలతో ముంబై నగరంలోని ప్రధాన వీధులు జలమయమయ్యాయి.

భారీ వర్షాలు.. మీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి : వాతావరణశాఖ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఎండతీవ్రత, తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్న ముంబైవాసులకు భారీ వర్షాలు ఊరటనిస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తోన్న వర్షాలతో ముంబై నగరంలోని ప్రధాన వీధులు జలమయమయ్యాయి. మరో 48 గంటలపాటు నగరంలో భారీ వర్షాలు పడే ఛాన్సుందని ఐఎండీ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. రాబోయే 48 గంటల్లో ముంబై సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. గత వారంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన బలహీన వాతావరణ పరిస్థితులు, 'ఎల్ నినో' ప్రభావం వల్ల రుతుపవనాల పురోగతి నెమ్మదించింది. అయితే.. ప్రస్తుతం పశ్చిమ తీరంలో రుతుపవన వ్యవస్థ మళ్లీ బలాన్ని పుంజుకుంటోంది. ఇప్పటికే ఇవి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయని ఐఎండీ ధృవీకరించింది.

మహానగరం ముంబైలో మంగళవారం ఉదయం నుంచే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మాటుంగా, సేనాపతి బాపట్ రోడ్ మరియు పరిసర ప్రాంతాలలో భారీ జల్లులు కురిశాయి. ఉదయం 8:30 గంటల సమయానికి బాంద్రా-వర్లి సీ లింక్ (Bandra-Worli Sea Link) పరిసరాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాబోయే కొన్ని గంటల పాటు నగరంలో వర్ష తీవ్రత గరిష్ఠ స్థాయిలో ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా దక్షిణ ముంబై, పశ్చిమ శివారు ప్రాంతాలపై ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుందని, మధ్యాహ్నం తర్వాత కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Next Story