మీ ఇంటి పేరును నేను మారిస్తే.. అది నాది అవుతుందా ? : జైశంకర్

by Dishanational4 |
మీ ఇంటి పేరును నేను మారిస్తే.. అది నాది అవుతుందా ? : జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో : అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టిన వ్యవహారంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటుగా స్పందించారు. పేర్లు మార్చి చైనా సాధించేదేమీ ఉండదని ఆయన తేల్చి చెప్పారు. అరుణాచల్ ఇప్పటికీ, ఎప్పటికీ ఇండియాలోనే ఉంటుందని స్పష్టం చేశారు. సోమవారం గుజరాత్‌లో విలేకరుల సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. ‘‘ఈ రోజు నేను మీ ఇంటి పేరును మారిస్తే.. అది నాది అయిపోతుందా ? అరుణాచల్ ప్రదేశ్ భారతదేశానికి చెందిన రాష్ట్రం. ఎప్పటికీ మా దేశంలో భాగంగానే అది ఉంటుంది. అరుణాచల్‌లోని ఏరియాల పేర్లను చైనా మార్చడం వల్ల ఇండియాపై ఎలాంటి ఎఫెక్టూ ఉండదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) దగ్గర భారత సైన్యం మోహరించే ఉందన్నారు. ఇక చైనా తీరును ఖండిస్తూ భారత విదేశాంగ శాఖ మరో అధికారిక ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్‌ అన్ని రకాలుగా భారత్‌లోని కీలకమైన భాగమని వెల్లడించింది.

Next Story

Most Viewed