ECI: అది ఓటర్ల గోప్యతకు భంగం కలించడమే.. మహారాష్ట్ర పోలింగ్‌ సీసీ ఫుటేజీల డిమాండ్‌పై ఈసీ

by Prasad Jukanti |

గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ వివాదం సద్దుమణగడం లేదు.

ECI: అది ఓటర్ల గోప్యతకు భంగం కలించడమే.. మహారాష్ట్ర  పోలింగ్‌ సీసీ ఫుటేజీల డిమాండ్‌పై ఈసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ వివాదం సద్దుమణగడం లేదు. ఈ ఎన్నికల ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (maharashtra poll) పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీ ఫుటేజీలను (CCTV footage) బహిరంగ పర్చాలని ప్రతిపక్షాల డిమాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of india) స్పందించింది. పోలింగ్ సీసీ ఫుటేజీలు బహిరంగ పరిస్తే అది ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఎన్నికల ఫలితంపై 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ఆ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ కెమెరా రికార్డింగ్ లు, వెబ్ కాస్టింగ్ , వీడియో ఫుటేజ్ లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దీనికి సంబంధించి రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు మే 30న లేఖలు పంపగా ఆ విషయం ఇటీవల బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి సీసీ ఫుటేజీలు బహిరంగ పర్చడం అంటే ఓట్ల గోప్యతకు భంగం కలిగించడమేనని ఈసీ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ప్రజాస్వామ్యం రిగ్గింగ్ కు గురైందని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఓడిపోయే అవకాశం ఉన్నప్రతిచోట ఇలాగే జరుగుతోందని త్వరలో బిహార్ లోనూ ఆ పార్టీ ఇదే చేయబోతున్నదని ఆరోపించారు.

Next Story