రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలకు దిగిన జ్యోతిరాధిత్య సింధియా

by Disha Web Desk 17 |
రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలకు దిగిన జ్యోతిరాధిత్య సింధియా
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా బుధవారం రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీపై పదునైన మాటలతో దాడికి దిగారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ‘ద్రోహి’ సిద్ధాంతం తప్ప ఆ పార్టీకి మరో సిద్ధాంతం లేదని అన్నారు. పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత రాహుల్‌ను కాంగ్రెస్ ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నందుకు బీజేపీ నాయకుడు ఈ దాడి చేశారు. న్యాయవ్యవస్థపై ఆ పార్టీ ఒత్తిడి తెస్తోందని.. అందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

‘ఈ పార్టీ వెనుకబడిన వర్గాలను అవమానించింది. మన సాయుధ బలగాల ధైర్య సాహసాలకు రుజువును కోరింది. మన సైనికులను చైనా కొట్టడం గురించి మాట్లాడింది. కాంగ్రెస్‌కు ఎలాంటి సిద్ధాంతాలూ లేవు. ఈ కాంగ్రెస్‌కు దేశ ద్రోహి అనే సిద్ధాంతం ఒక్కటే ఉంది. అది దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది’ అని రాహుల్‌పై సింధియా ప్రత్యక్ష మాటల దాడి చేశారు.

జ్యోతిరాధిత్య సింధియా చాలా కాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు. అయితే తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో నాయకత్వ విభేదాల వల్ల ఆయన 2020లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోవడంలో కీలకపాత్ర పోషించారు.

రాహుల్ వ్యక్తిగత న్యాయ పోరాటాన్ని ప్రజాస్వామ్యం కోసం చేస్తున్న పోరాటంగా కాంగ్రెస్ అభివర్ణిస్తోందని మంత్రి అన్నారు. పరువు నష్టం కేసులో అప్పీల్ కోసం రాహుల్ సూరత్ వెళ్ళేటప్పుడు తన అనుచరులను, మంది మార్బలాన్ని తీసుకెళ్లి న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తారని సింధియా అన్నారు.


Next Story