IAF: యూపీ గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వైమానిక దళ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్

by S Gopi |   (  Updated:2025-05-02 21:06:26  IST  )

ఇది దేశ రక్షణ సంసిద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది

IAF: యూపీ గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వైమానిక దళ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ మనదేశ వైమానిక దళ యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో టేకాఫ్, ల్యాండింగ్ కోసం సాధన చేస్తున్నాయి. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై సుమారు 3.5 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్‌పై 'ల్యాండ్ అండ్ గో' డ్రిల్‌ నిర్వహించాయి. రన్‌వేకు ప్రత్యామ్నాయంగా ఎంత మేరకు పనిచేస్తుందనే అంశాన్ని గంగా ఎక్స్‌ప్రెస్‌వేను పరిశీలించారు. ఇది దేశ రక్షణ సంసిద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. యుద్ధ విమానాల పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కూడా ల్యాండింగ్‌లను సులభతరం చేసే ప్రత్యేక సామర్థ్యంతో ఈ ఎక్స్‌ప్రెస్‌వే స్ట్రెచ్‌ను నిర్మించారు. దీంతో ఈ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే మొట్టమొదటి ఎయిర్‌స్ట్రిప్‌గా నిలిచింది. ఇదివరకు, లక్నో-ఆగ్రా, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలలో కూడా ఇలాంటి అత్యవసర ల్యాండింగ్ డ్రిల్‌లు నిర్వహించారు, కానీ అవి పగటిపూట మాత్రమే చేశారు. పగటి పూట సాధారణ వేళల్లో పరీక్షలు జరుగుతుండగా, రాత్రి సమయంలో మాత్రం 7-10 గంటల మధ్య నిర్వహిస్తారు. ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధ విమానాల ప్రదర్శనలను చూడటానికి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు, స్థానికులు తరలివచ్చారు. ట్రయల్స్ నిర్వహించిన వాటీలో రఫెల్, ఎస్‌యూ-30 ఎంకేఐ, మిరాజ్-2000, ఎంఐజీ-29, జాగ్వార్, సీ-130జే సూపర్ హెర్క్యులస్, ఏఎన్-32, ఎంఐ-17 వీ5 హెలికాప్టర్‌తో సహా అనేక రకాల ఐఏఎఫ్ విమానాలు ఉన్నాయి. భద్రత, నిఘాను దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌ప్రెస్‌వేలో 250కి పైగా సీసీటీవీ కెమెరాలు అమర్చారు. కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఉన్నతస్థాయి రక్షణ, రాష్ట్ర అధికారులు హాజరయ్యారు.

Next Story