అసెంబ్లీ సాక్షిగా నవ్వుల పాలైన సీఎం.. గతేడాది బడ్జెట్ చదివిన అశోక్ గెహ్లాట్

by Disha Web Desk 17 |
అసెంబ్లీ సాక్షిగా నవ్వుల పాలైన సీఎం.. గతేడాది బడ్జెట్ చదివిన అశోక్ గెహ్లాట్
X

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీ సాక్షిగా నవ్వుల పాలయ్యారు. ఆర్థికశాఖనూ తన వద్దే ఉంచుకున్న గెహ్లాట్.. శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సమయంలో పొరపాటున గతేడాది బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చిన ఆయన.. ఏకంగా 8 నిమిషాల పాటు వాటినే చదివి వినిపించారు. ఆఫీసర్స్ గ్యాలరీలో కూర్చున్న ఆర్థిక శాఖ అధికారులు.. తప్పును గుర్తించి చీఫ్ విప్ మహేశ్ జోషీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అసలు విషయం సీఎంకు చెప్పటంతో నాలుక కరుచుకున్న గెహ్లాట్.. తన ప్రసంగాన్ని ఆపేశారు.

దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రతిపక్షాలు.. ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడుకున్నాయి. విషయం తెలిసిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకొచ్చి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బడ్జెట్‌ లీకైందంటూ ఆరోపించారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సీపీ జోషి.. అసెంబ్లీని 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. పున:ప్రారంభమైన సభలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ, సీఎం దగ్గర తప్పుడు బడ్జెట్ పత్రాలు ఉన్నాయని చీఫ్ విప్‌కు ఎలా తెలుసని ప్రశ్నించారు.

దీనర్థం బడ్జెట్ లీకైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గవర్నర్ దగ్గరికెళ్లి, కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మరో తేదీని అడగాలని డిమాండ్ చేశారు. సభ మరోసారి వాయిదా పడిన అనంతరం సీఎం గెహ్లాట్ కొత్త బడ్జెట్ ప్రతులను చదివి వినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మాజీ సీఎం వసుంధర రాజే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. '8 నిమిషాలపాటు గతేడాది బడ్జెట్‌ను చదివినా గుర్తించని సీఎం చేతుల్లో రాష్ట్రం ఎలా సురక్షితంగా ఉంటుంది' అని ప్రశ్నించారు.

మరోవైపు, పాత బడ్జెట్‌ ప్రతులను చదవడంపై సీఎం స్పందిస్తూ, బడ్జెట్ లీకైందనే ఆరోపణలను తోసిపుచ్చారు. రిఫరెన్స్ కోసమే గత బడ్జెట్‌లోని ఒక పేజీని తీసుకొచ్చానని చెప్పారు. ఇది పొరపాటున జరిగిందని, తనను క్షమించాలని సభ్యులను కోరారు.



Next Story

Most Viewed