ఎన్నికల్లో పోటీకి డబ్బుల్లేవ్.. కులం, మతంతో ఓట్లు అడగలేను :కేంద్ర ఆర్థిక మంత్రి

by Dishanational4 |
ఎన్నికల్లో పోటీకి డబ్బుల్లేవ్.. కులం, మతంతో ఓట్లు అడగలేను :కేంద్ర ఆర్థిక మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన దగ్గర సరిపడా డబ్బులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలియజేసి, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడులో ఏ లోక్‌సభ స్థానాన్నైనా ఎంపిక చేసుకోమని నడ్డా ఆఫర్ ఇచ్చారని.. తాను వారం, పదిరోజులు ఆలోచించుకొని నో చెప్పానని నిర్మల తెలిపారు. ‘‘నేను ఏ స్థానం నుంచి పోటీ చేసినా అది సమస్యే. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ఇతర అభ్యర్థులు ఉపయోగించే అనేక మార్గాలను వాడేందుకు నాకు మనసొప్పదు. గెలుపు కోసం అలాంటి దారుల్లో నేను నడవలేను. కులాన్ని, మతాన్ని వాడుకొని ఓట్లు అడగలేను. అలా ప్రవర్తిస్తూ ఎన్నికల్లో పోటీ చేయడం నా వల్ల కాదు’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆమె ఈవివరాలను వెల్లడించారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి దగ్గర నిధులు లేకపోవడమేంటి?’’ అని సదరు మీడియా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నిర్మల బదులిస్తూ.. ‘‘కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా (దేశ ఖజానా) నాది కాదు. అది దేశానిది’’ అని తెలిపారు. ‘‘నా జీతమే నా సంపాదన.. నా పొదుపు డబ్బులే నావి.. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నాది కాదు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాను బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని వెల్లడించారు. గురువారం రోజు కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తరఫున ప్రచారం చేస్తానని వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు నిర్మల ప్రాతినిధ్యం వహిస్తున్నారు.



Next Story

Most Viewed