అయోధ్య రామయ్య నాతో ఆ మాట చెప్పారు : ప్రధాని మోడీ

by Dishanational4 |
అయోధ్య రామయ్య నాతో ఆ మాట చెప్పారు : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్యలోని నవ్య భవ్య రామమందిరంలో జనవరి 22న ప్రతిష్ఠించిన రామ్ లల్లా విగ్రహాన్ని తొలిసారి చూసినప్పుడు తన మదిలో మెదిలిన భావాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివరించారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ‘‘నేను అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా వద్దకు చేరుకోగానే తొలుత ఆయన పాదాలను చూశాను. ఆ తర్వాత ఆయన కళ్లలోకి చూశాను. చాలాసేపు నా చూపును తిప్పుకోలేకపోయాను’’ అని ప్రధానమంత్రి చెప్పుకొచ్చారు. ‘‘భారతదేశ సమయం ఆసన్నమైందని.. దేశం ఇప్పుడు పురోగమిస్తోందని రామ్ లల్లా చెబుతున్నట్లుగా నా మనసులో నేను సందేశాన్ని వినగలిగాను” అని ఆయన తెలిపారు. ఇక అంతకుముందు అయోధ్యలో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలంటూ రామజన్మభూమి ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందిన వెంటనే తాను దినచర్యను మార్చుకొని, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అనుగుణంగా రోజువారీ షెడ్యూల్‌ను సవరించుకున్నట్లు మోడీ వివరించారు. ‘‘శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం నేను జనవరి 22న అయోధ్యకు చేరుకున్నాను. ఆ సమయంలో నాలో కొన్ని ప్రశ్నలు ఉదయించాయి. నేను సామాన్య దేశ పౌరుడిగా, రామభక్తుడిగా అయోధ్యకు వచ్చానా ? ప్రధానమంత్రి హోదాలో వచ్చానా ? అనే ప్రశ్నలు ఎదురు నిలిచాయి. ప్రధానమంత్రి హోదాను దరిచేరనివ్వకుండా రామభక్తుడిగా కార్యక్రమంలో పాల్గొనాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను’’ అని ప్రధానమంత్రి తెలిపారు.

Next Story

Most Viewed