West Bengal: బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు నిరాకరించిన వైద్యులు

by S Gopi |

జరిగిన దారుణంపై తమ నిరసనను కొనసాగిస్తామని, వైద్య సేవలను నిలిపేందుకు కట్టుబడి ఉన్నట్టు వైద్యులు సందేశం పంపారు.

West Bengal: బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు నిరాకరించిన వైద్యులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రెయినీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి నిరసన తెలుపుతున్న వారితో చర్చలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంపిన ఆహ్వానాన్ని వైద్యులు తిరస్కరించారు. జరిగిన దారుణంపై తమ నిరసనను కొనసాగిస్తామని, వైద్య సేవలను నిలిపేందుకు కట్టుబడి ఉన్నట్టు వైద్యులు సందేశం పంపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మమతా బెనర్జీ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశానికి జూనియర్ డాక్టర్లను ఆహ్వానించారు. ప్రభుత్వంతో చర్చలకు జూనియర్ వైద్యుల బృందం(గరిష్ఠంగా 10 మంది) సచివాలయానికి రావాలని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి ఎన్ ఎస్ నిగమ్ మెయిల్ పంపించారు. ఈ విషయంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ.. వైద్యులతో చర్చించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని, కానీ నిరసన తెలుపుతున్న వైద్యులు ఇది అవమానించేదిగా ఉందని, డాక్టర్ నిగమ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు వైద్యుల తరపున 10 మందిని మాత్రమే పరిమితం చేయడం మాకు అవమానంగా అనిపించిందని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు.

Next Story