బస్తర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఒకేసారి 108 మంది సరెండర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-11 14:50:10  IST  )

బస్తర్ డివిజన్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలింది. ‘పూనా మార్గెమ్’ ప్రచారంతో ప్రభావితమై 108 మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.

బస్తర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఒకేసారి 108 మంది సరెండర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చేపట్టిన ‘పూనా మార్గెమ్ - పునరావాసం నుంచి పునర్జీవనం’ అనే కార్యక్రమం బస్తర్ ప్రాంతంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ బస్తర్ సంభాగ్ ముఖ్యకేంద్రమైన జగదల్‌పూర్‌లోని ‘శౌర్య భవన్’ పోలీస్ కో-ఆర్డినేషన్ సెంటర్ వేదికగా భారీ ఎత్తున మావోయిస్టుల సరెండర్ అయ్యారు.

108 మంది లొంగుబాటు..

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన 108 మంది మావోయిస్టు క్యాడర్లు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో 44 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. ఇక లొంగిపోయిన ఈ 108 మంది మావోయిస్టులపై ప్రభుత్వం మొత్తం రూ.3.29 కోట్ల రివార్డును ప్రకటించింది. సరెండర్ అయిన వారిలో రాహుల్ తేలాం (DVCM), పండ్రూ కోవాసి, జితురూ ఓయామ్ వంటి 5 గురు డివిజనల్ కమిటీ సభ్యులు (DVCM), ఇద్దరు CYPC కమాండర్లు, 15 మంది ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు (PPCM) ఉన్నారు.

భారీగా ఆయుధాలు స్వాధీనం..

సరెండర్ అయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు భద్రతా దళాలు వివిధ ప్రాంతాల్లోని డంపులపై దాడులు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. అందులో 7 AK-47 రైఫిళ్లు, 10 ఇన్సాస్ (INSAS) రైఫిళ్లు, 4 ఎల్‌ఎమ్‌జీ (LMG), 11 బిజి‌ఎల్ (BGL) లాంచర్లు, 20 303-రైఫిళ్లు, 25 కంట్రీ మేడ్ 12 బోర్ రైఫిళ్లు ఉన్నాయి.

లిక్విడ్ క్యాష్, గోల్డ్ కూడా..

లొంగుబాట్లలో భాగంగా చరిత్రలో ఎన్నడూ లేని తొలిసారిగా ఒకే చోట రూ.3.61 కోట్ల లిక్విడ్ క్యాష్, 1 కిలో బంగారం కూడా స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. అత్యధికంగా నారాయణపూర్ జిల్లా నుంచి 49 ఆయుధాలు లభించగా, బస్తర్ (24), సుక్మా (12), బీజాపూర్ (09), దంతేవాడ (05), కాంకేర్ (02) జిల్లాల నుంచి మిగిలిన ఆయుధాలను భద్రతా దళాలు రికవరీ చేశాయి.

ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత 26 నెలల్లో మొత్తం 2,714 మంది మావోయిస్టులు హింసను వీడి శాంతి మార్గంలోకి వచ్చారని ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పిస్తామని భరోసానిచ్చారు. ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరాలని వారు విజ్ఞప్తి చేశారు.

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. మోస్ట్ వాంటెట్ నేత పాపారావు సరెండర్?

Next Story