Hotel fire: కోల్‌కతా అగ్ని ప్రమాదం.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

by B.Srinivas |

కోల్ కతాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఫల్పట్టి మచ్చువా సమీపంలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Hotel fire: కోల్‌కతా అగ్ని ప్రమాదం.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా (Kolkata) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఫల్పట్టి మచ్చువా సమీపంలోని ఓ హోటల్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా.. మరో 13 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో 13 మంది ఊపిరాడక చనిపోగా మరొకరు తన ప్రాణాలకు కాపాడుకునే క్రమంలో బిల్డింగ్ పై నుంచి దూకి మరణించినట్టు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చి 22 మందిని రక్షించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు. ఘటనపై దర్యాప్తు చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేసింది. ప్రమాదం సమయంలో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అనేక మంది హోటల్ పైకప్పు, కిటీకీల నుంచి దూకుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి.

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ‘కోల్‌కతాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం బాధాకరం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు. సీఎం మమతా బెనర్జీ (Mamatha benarjee) సైతం మృతులకు సంతాపం తెలిపారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

Next Story