LK Advani : నాకు, నా ఆదర్శాలకు దక్కిన గౌరవమిది : అద్వానీ

by Dishanational4 |
LK Advani : నాకు, నా ఆదర్శాలకు దక్కిన గౌరవమిది : అద్వానీ
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారతరత్నను తనకు ప్రకటించినందుకు బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇది ఒక వ్యక్తిగా నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదు.. జీవితాంతం నా శక్తి మేరకు దేశసేవ చేయడానికి అనుసరించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా దక్కిన గౌరవం’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘నేను 14 ఏళ్ల వయసులో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన సమయం ఇంకా గుర్తుంది. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ నాకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో, నిస్వార్థంగా నిర్వర్తించాను’’ అని అద్వానీ చెప్పారు.‘‘నా జీవితాన్ని ప్రేరేపించిన శక్తివంతమైన నినాదం ‘ఇదం-న-మమ’. ‘ఈ జీవితం నాది కాదు. నా జీవితం నా దేశం కోసమే’ అనే గొప్ప అర్ధం కలిగిన ఈ నినాదం నన్ను ముందుకు నడిపింది’’ అని తెలిపారు. ‘‘పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి వారితో సన్నిహితంగా పనిచేసే గొప్ప అవకాశం నాకు దక్కింది. ఆ ఇద్దరు మహానుభావులను ఈరోజు నేను కృతజ్ఞతతో స్మరించుకుంటున్నాను’’ అని అద్వానీ పేర్కొన్నారు. ‘‘స్వర్గస్తురాలైన నా భార్య కమలా అద్వానీకి ఈసందర్భంగా నేను మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజా జీవితంలో నాతో కలిసి పనిచేసిన లక్షలాది మంది కార్యకర్తలు, స్వయంసేవకులను ఈ తరుణంలో మర్చిపోలేను. నా జీవితంలో వాళ్లే గొప్ప బలంగా, బలగంగా నిలిచారు’’ అని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అద్వానీ పాకిస్తాన్‌లోని కరాచీలో 1927 నవంబర్ 8న జన్మించారు. 1980లో బీజేపీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధిక కాలం పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసింది అద్వానీయే. అద్వానీ దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ పార్లమెంటరీ జీవితాన్ని సైతం కలిగి ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి (1999-2004) సారథ్యంలోని కేంద్ర కేబినెట్‌లో మొదట హోం మంత్రిగా, తదుపరిగా ఉప ప్రధానమంత్రిగా అద్వానీ సేవలందించారు.

Next Story

Most Viewed