కేరళ వక్ఫ్ బోర్డుకు షాకిచ్చిన హైకోర్టు.. నియామకాల ఉల్లంఘనపై సంచలన స్టే

by Kema Shiva Kumar |

కేరళ వక్ఫ్ బోర్డు పనితీరుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కేరళ వక్ఫ్ బోర్డుకు షాకిచ్చిన హైకోర్టు.. నియామకాల ఉల్లంఘనపై సంచలన స్టే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా వక్ఫ్ బోర్డులపై వివాదాలు ముసురుకున్న వేళ కేరళ వక్ఫ్ బోర్డు (Kerala Waqf Board) పనితీరుపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత వక్ఫ్ బోర్డు ఏర్పాటు నిబంధనల ప్రకారం లేదని పేర్కొంటూ, దాని రోజువారీ కార్యకలాపాలపై ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది. వివాదం సర్దుమణిగే వరకు బోర్డు రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు వక్ఫ్ బాధ్యతలు చూసే జాయింట్ సెక్రటరీని కోర్టు నియమించింది. అదేవిధంగా ఇదే సమయంలో ఎలాంటి కీలక విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని చీఫ్ జస్టిస్ సౌమెన్ సేన్ (Chief Justice Soumen Sen), జస్టిస్ వీఎం శ్యామ్‌కుమార్ (Justice VM Shyamkumar) ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

కాగా, బీజేపీ నాయకుడు షాన్ జార్జ్ (Shaan George) ప్రస్తుత వక్ఫ్ బోర్డు ఏర్పాటు చట్టవిరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వక్ఫ్ చట్టం ప్రకారం బోర్డులో ఇద్దరు ముస్లిమేతర సభ్యులు ఉండాలని, అయితే ప్రస్తుత బోర్డులో ఆ నిబంధనను పాటించలేదని వారు వాదించారు. ఇక కొందరు సభ్యులకు నిర్దేశిత చట్టపరమైన అర్హతలు లేవని, వక్ఫ్ శాఖ జాయింట్ సెక్రటరీ స్థానంలో లా డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ అధికారిని నియమించారని ఆరోపించారు. ఈ విచారణ సందర్భంగా కేరళ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ జాజు బాబు (Jaju Babu) స్పందిస్తూ.. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం బోర్డును పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుత బోర్డులో చట్టం ప్రకారం ఉండాల్సిన 11 మంది సభ్యులకు గానూ కేవలం 9 మందే ఉన్నారని, ఇది నిబంధనల ప్రకారం జరగలేదని ఆయన కూడా అంగీకరించారు. దీంతో చట్టబద్ధమైన నిబంధనలను పాటించనప్పుడు ప్రస్తుత బోర్డు ఎలా కొనసాగుతుందని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ వరకు బోర్డు బాధ్యతలను జాయింట్ సెక్రటరీకి అప్పగిస్తూ కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది.

Next Story