హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల బీభత్సం.. ఏడు జిల్లాలకు వరదల హెచ్చరికలు

by Malleboina Mahesh |

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల బీభత్సం సృష్టిస్తుండగా.. ఏడు జిల్లాలకు వరదల హెచ్చరికలు జారీ చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల బీభత్సం.. ఏడు జిల్లాలకు వరదల హెచ్చరికలు
X

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు (Torrential rains) విపరీతంగా ముంచెత్తుతున్నాయి. రాజధాని సిమ్లా సహా పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో (Landslide) సుమారు డజనుకు పైగా వాహనాలతో పాటు పలు ఇళ్లు మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయాయి. వర్షాలు, వరదల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 108 రహదారులు మూతపడగా, 38 తాగునీటి సరఫరా పథకాలు, 9 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు నిలిచిపోయినట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) వెల్లడించింది. అలాగే ఆకస్మిక వరదల కారణంగా వందలాది వాహనాలు వరదలో చిక్కుకొని పోయాయి.

రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఏడు జిల్లాలకు (చంబా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సిర్మోర్, సోలన్) ఫ్లాష్ ఫ్లడ్ (దిశ మార్చుకునే హఠాత్ వరద) ముప్పు ఉందని వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జులై 30 వరకు, అలాగే ఆగస్టు 3న ఆరెంజ్ హెచ్చరికలు (Orange Alert) జారీ చేసింది. కొండ ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని పరిపాలనా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

Next Story