లిక్కర్ స్కాం డబ్బుపై కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు

by Dishanational4 |
లిక్కర్ స్కాం డబ్బుపై కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటివరకు 250 సార్లకుపైగా సోదాలు జరిపారు. ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదు. గురువారం రోజు (మార్చి 28న) కోర్టులో న్యాయమూర్తి ఎదుట అరవింద్ కేజ్రీవాల్ నిజానిజాలన్నీ బయటపెడతారు. ఈవిషయాన్ని ఆయన స్వయంగా నాతో చెప్పారు. లిక్కర్‌ స్కాం డబ్బు ఎక్కడుందో కూడా న్యాయస్థానంలో సీఎం చెబుతారు. అందుకు తగిన ఆధారాలను సమర్పిస్తారు’’’ అని సునీతా కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

నా భర్తకు ఆరోగ్యం సహకరించడం లేదు : సునీతా కేజ్రీవాల్

‘‘నా భర్తను అరెస్టు చేసి ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు. షుగర్​తో ఇబ్బందిపడుతున్నారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే ఢిల్లీ ప్రజల బాగోగులు అడిగి తెలుకుంటున్నారు. దీన్ని కూడా మోడీ ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది. ఆయనపై అక్రమ కేసులు పెడుతోంది. ఢిల్లీని నాశనం చేయాలని వారు కోరుకుంటున్నారు. ఈ వరుస పరిణామాలతో కేజ్రీవాల్​ ఆందోళన చెందుతున్నారు’’ అని సునీతా కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ నిజమైన దేశభక్తుడు, ధైర్యం గల నేత అని ఆమె కొనియాడారు. లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతున్న టైంలోనే ఆయన సతీమణి సునీత ఈ సంచలన ప్రకటన విడుదల చేయడం గమనార్హం. మంగళవారం సాయంత్రం అరవింద్​ కేజ్రీవాల్​ను కలిసొచ్చాక సునీత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

నాడు రాబ్రీ దేవీ.. నేడు సునీతా కేజ్రీవాల్ : కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్

సునీతా కేజ్రీవాల్​ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ స్పందించారు. లాలూ ప్రసాద్​ యాదవ్​ దాణా కుంభకోణంలో చిక్కుకున్నప్పుడు రాబ్రీ దేవీ ఇలాగే ప్రకటనలు చేసేవారని.. ప్రస్తుతం సునీతా కేజ్రీవాల్​ వ్యవహారం అలాగే కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్​ అవినీతికి వ్యతిరేకంగా గతంలో కేజ్రీవాల్ నిరాహార దీక్షలు చేసేవారని.. ఇప్పుడు ఆయనే అవినీతి ఊబిలో కూరుకుపోయారని విమర్శించారు. ‘‘ఆప్​కు చెందిన ఎంపీ, మంత్రులు, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ అందరూ జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ప్రధాన పాత్రదారుడిగా ఉన్న సీఎం కూడా అక్కడే ఉన్నారు. కేజ్రీవాల్​కు సీఎం పదవిపై ఎంత వ్యామోహం అంటే ఆయన జైల్లో ఉండి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు’’ అని అనురాగ్​ ఠాకూర్ కామెంట్ చేశారు.

Next Story