- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జయలలిత ఆస్తులన్నీ తమిళనాడుకే.. మొత్తం ఎన్ని కోట్లో తెలుసా?
తమిళనాడు దివంగత సీఎం, నటి జయలలిత అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు దివంగత సీఎం, నటి జయలలిత అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారన్న కేసులో దోషిగా తేలటంతో రాజకీయ విమర్శలు, అనేక కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే, ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తులు వివరాలు, బ్యాంకు బ్యాలెన్స్ గురించి చర్చకు వచ్చింది. తాజాగా బెంగళూరు సిబీఐ కోర్టు జయలలితకు ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
జయలలిత లెక్కకు మించిన ఆస్తులు కూడబట్టిన కేసులో దోషిగా తేలారు. కానీ 2016తో ఆమె మరణించిన తరువాత ఆ కేసు విచారణను కోర్టు నిలిపివేసింది. అయితే ఆమె ఆస్తుల జప్తును సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే జయలలితపై ఉన్న కేసును కొట్టివేసినందున, ఆమె ఆస్తులను జప్తు చేయకూడదని జయలలిత మేనకోడలు జె.దీప, మేనల్లుడు జె.దీపక్ వాదించారు. అయితే ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఇతరులను దోషులుగా నిర్ధారించిందని, అందువల్ల ఆస్తుల జప్తు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్.ఎ.మోహన్ అధికారులను ఆదేశించారు.
జయలలిత ఆస్తుల వివరాలు..
జయలలితకు చెందిన 1,562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 11 వేలకు పైగా పట్టు చీరలు, 750కి పైగా ఖరీదైన చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ఆస్తులు, వస్తువులు తమకు చెందాలంటూ జయలలిత వారసులుగా చెబుతున్న జె.దీపక్, జె.దీప వేసుకున్న అర్జీని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ రూ. 913 కోట్లు అని పేర్కొంది. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ. 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా.
జయలలిత 1991-96 మధ్య కాలంలో తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 1996లో ఆమెపై అక్రమాస్తుల కేసులో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఆమె రెండు నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు. 1997లో సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2000 సంవత్సరం వరకు జరిగిన విచారణలో దాదాపు 250 మంది సాక్షులను విచారించింది న్యాయస్థానం.
అయితే 2002లో జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత కేసు.. అదే రాష్ట్రంలో విచారణ జరిపితే కేసు పక్కదోవ పడుతుందని డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసును 2003లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు.






