US-Iran: రూ. 4,500 కోట్లకు పైగా ఖరీదైన ఆపరేషన్ నిర్వహించిన అమెరికా

by S Gopi |

ఎఫ్‌–15ఈ యుద్ధ విమానం నేలకూలడంతో ఇరాన్‌లో చిక్కుకున్న ఆయుధ స్పెషలిస్టును కాపాడటానికి అమెరికా భారీ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది.

US-Iran: రూ. 4,500 కోట్లకు పైగా ఖరీదైన ఆపరేషన్ నిర్వహించిన అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా సైన్యం ఇరాన్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఎఫ్‌–15ఈ యుద్ధ విమానం నేలకూలడంతో ఇరాన్‌లో చిక్కుకున్న ఆయుధ స్పెషలిస్టును కాపాడటానికి అమెరికా భారీ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. పూర్తిగా హాలీవుడ్ సినిమా స్థాయిలో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఎట్టకేలకు నేవీ సీల్‌ కమెండో టీమ్ తమ ఎయిర్‌మ్యాన్‌ను రక్షించింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్ దక్షిణ ప్రాంతంలో చేపట్టిన ఈ అత్యంత ప్రమాదకరమైన, రోజుల పాటు సాగిన అమెరికా రెస్క్యూ మిషన్, టార్గెట్‌ను పూర్తి చేయడంలో మాత్రమే కాకుండా, దాదాపు 500 మిలియన్ డాలర్ల(రూ. 4,500 కోట్ల)కు పైగా ఖరీదైన భారీ వ్యయం కారణంగా అందరూ చర్చించుకునే అంశంగా మారింది.

ఆ ప్రాంతపు భూభాగం, వెంటాడుతున్న ఇరాన్, రికవరీ తర్వాత ఎదురయ్యే సమస్యల కారణంగా ఈ రెస్క్యూ ప్రయత్నాన్ని అమెరికా అధికారులు 'అత్యంత సవాలుతో కూడిన' వార్ సెర్చ్-రెస్క్యూ మిషన్లలో ఒకటిగా అభివర్ణించారు. ఈ ఆపరేషన్‌లో ఏ-10 థండర్‌బోల్ట్ 2 జెట్‌లు, ఎంసీ-130జే కమాండో 2 విమానాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌లతో సహా అనేక అధునాతన సైనిక ఆయుధాలను ఉపయోగించారు. వీటిలో చాలా వరకు మిషన్ జరుగుతున్న సమయంలో ధ్వంసమయ్యాయి.

అమెరికా మిషన్

ఇరాన్ అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ జెట్‌ను కూల్చివేసింది. ఆ జెట్ కూలిన తర్వాత సిబ్బందిలోని ఇద్దరూ బయటకు దూకేశారు. పైలట్‌ను రక్షించినప్పటికీ, ఆయుధ స్పెషలిస్టు శత్రు భూభాగంలో చిక్కుకుపోయాడు. అతని వద్ద కేవలం ఒక పిస్టల్‌ మాత్రమే ఉంది. అతడిని పట్టుకునేందుకు ఇరాన్ సైన్యం ఆ ప్రాంతమంతా దిగ్బంధించింది. ఇందుకు స్థానికులకు 66,100 డాలర్ల బహుమతి ఇస్తామని ఇరాన్ అధికారిక మీడియాలో ప్రకటించింది. అతను పర్వత ప్రాంతంలో 24 గంటలకు పైగా పట్టుబడకుండా తప్పించుకోవాల్సి వచ్చింది. అనంతరం అమెరికా సీ-130 హెర్క్యులస్ విమానాలు, హెచ్-60 హెలికాప్టర్లు ఇరాన్ భూభాగంలో చాలా లోపల ఉన్న అతని సిగ్నల్‌ను నిఘా డ్రోన్‌లు పసిగట్టి, ఆపరేషన్ టీమ్ రంగంలోకి దింగింది. గాయపడిన ఆయుధ స్పెషలిస్టును ఇరాన్ సైనికులను దూరంగా ఉంచడానికి అమెరికా దళాలు బాంబులు, కవర్ ఫైర్‌ను ఉపయోగించినట్లు సమాచారం.

అతడిని రక్షించి తీసుకెళ్లే సమయంలో లాక్‌హీడ్ మార్టిన్ సీ-130 విమానాలలో ఎంసీ-130జే కమాండో 2 వేరియంట్‌కు చెందినవి, ఒక్కొక్కటి 100 మిలియన్ డాలర్లకు పైగా విలువైనవి సాంకేతిక లోపాల కారణంగా పనిచేయకుండా పోయాయి. సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం శత్రువుల చేతుల్లోకి వెళ్లకుండా చేయడానికి అమెరికా దళాలు ఈ మిషన్‌లో రెండు సీ-130 కార్గో విమానాలను ధ్వంసం చేశాయి. అలాగే, ఒక్కొక్కటి సుమారు 7.5 మిలియన్ డాలర్ల విలువైన కనీసం రెండు ఎంహెచ్-6 లిటిల్ బర్డ్ హెలికాప్టర్లను ఒక ఫార్వర్డ్ బేస్ వద్ద ముంచివేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక్కొక్కటి 30 నుంచి 60 మిలియన్ డాలర్ల మధ్య విలువైన కొన్ని ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌లను కూడా కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. అయితే, దీన్ని అమెరికా ధృవీకరించలేదు.

Next Story