తిహార్ జైల్లో సీఎం కేజ్రీవాల్‌కు ఆ ముప్పు.. ?!

by Dishanational4 |
తిహార్ జైల్లో సీఎం కేజ్రీవాల్‌కు ఆ ముప్పు.. ?!
X

దిశ, నేషనల్ బ్యూరో : వీఐపీల జైలుగా ఢిల్లీలోని తిహార్ కారాగారానికి పేరుంది. ఈ జైలులోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఎంతో మంది ప్రముఖులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఈ జైలులో ఉన్న కొన్ని గ్యాంగ్‌ల సభ్యుల నుంచి కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు ఉందనే ప్రచారం జరగడంతో తిహార్ జైలు అధికారులు హైఅలర్ట్ అయ్యారు. సీఎం కేజ్రీవాల్ ఉన్న నంబర్ 2 బ్లాక్ వద్ద జైలు అధికారులు భద్రతను పెంచారు. జైల్లోని కొందరు ఖైదీలు పాపులర్‌ అయ్యేందుకు ఆప్ చీఫ్‌పై దాడికి తెగబడే ముప్పు ఉందని నిఘా వర్గాల నుంచి జైలు వర్గాలకు సమాచారం అందిందని తెలిసింది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ నుంచి కేజ్రీవాల్‌కు ఇటీవల బెదిరింపులు వచ్చాయి. తిహార్ జైల్లోని ఖలిస్తానీలు కేజ్రీవాల్‌పై దాడి చేస్తారని అతడు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఈ కారాగారంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులున్న బ్లాక్‌ల చుట్టూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో ఏదైనా అత్యవసరమైతే తక్షణమే స్పందించేందుకు కేజ్రీవాల్‌ గదికి అత్యంత సమీపంలోనే క్విక్‌రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు.

ఇదే బ్లాక్‌లో గతంలో హత్య..

ప్రస్తుతం కేజ్రీవాల్‌ ఉన్న రెండో నెంబరు జైలు బ్లాక్‌లో గతంలో హత్యలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. 2021లో శ్రీకాంత్‌ రామస్వామి అనే ఖైదీని గ్యాంగ్‌ వార్‌లో మర్డర్ చేశారు. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ వద్ద 2015లో జరిగిన ఓ హత్య కేసులో రామస్వామిని అరెస్టు చేసి తిహార్ జైల్లో పెట్టారు. అయితే నలుగురు విచారణ ఖైదీలు అతడిని క్రికెట్ బ్యాట్లతో కొట్టి చంపేశారు. ఇటీవల కూడా జైల్లో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో 33 మొబైల్‌ ఫోన్లు ఖైదీల దగ్గర దొరికాయి. జైలు సిబ్బంది డబ్బులకు ఆశపడి ఖైదీలకు సహకరిస్తున్న వైనం ఈ వ్యవహారంతో వెలుగుచూసింది.



Next Story

Most Viewed