Gst: ప్రతి పౌరుడికీ జీఎస్టీ సంస్కరణ ఫలాలు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

by B.Srinivas |

చారిత్రాత్మకమైన జీఎస్టీ సవరణ ప్రజల సంస్కరణ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు.

Gst: ప్రతి పౌరుడికీ జీఎస్టీ సంస్కరణ ఫలాలు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
X

దిశ, నేషనల్ బ్యూరో: చారిత్రాత్మకమైన జీఎస్టీ సవరణ ప్రజల సంస్కరణ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అభివర్ణించారు. దీని వల్ల ప్రతి కుటుంబానికీ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అలాగే వినియోగాన్ని పెంచడంతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. శనివారం ఆమె ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘తాజా జీఎస్టీ సవరణ140 కోట్ల మంది ప్రజల జీవితాలను తాకే సంస్కరణ. ఈ దేశంలో జీఎస్టీ బారిన పడని వ్యక్తి ఒక్కరు కూడా లేరు. అత్యంత పేదలు కూడా జీఎస్టీ తాకిన చిన్న వస్తువును కొనుగోలు చేస్తారు. కాబట్టి వారికి లబ్ధి చూకూరుతుంది’ అని అన్నారు. జీఎస్టీ సంస్కరణలకు ప్రతిస్పందనగా అనేక కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గించడం ప్రారంభించాయని తెలిపారు. కొత్త జీఎస్టీ రేట్లు అమలయ్యే సమయానికి మిగిలినవి కూడా దీనిని అనుసరించే అవకాశం ఉందని చెప్పారు.

2017లో ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఇదే అతిపెద్ద సంస్కరణ అని అన్నారు. రోజువారీ వినియోగ వస్తువులపై ప్రతి పన్నును కఠినంగా సమీక్షించామని, చాలా సందర్భాలలో రేట్లు బాగా తగ్గాయన్నారు. జీఎస్టీ వల్ల కలిగే ఈ సానుకూల ప్రభావం తమపై పడకుండా ఒక్క కుటుంబం కూడా ఉండబోదని ప్రతి పౌరుడికీ దీని వల్ల ఉపయోగం ఉందని నొక్కి చెప్పారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందజేయడాన్ని తాను స్వయంగా పరక్షవేక్షిస్తానని తెలిపారు. దేశంలో ద్రవ్యోల్భణం నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారు. కాగా, జీఎస్టీ శ్లాబులను కేంద్రం సవరించిన విషయం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.

అన్ని రాష్ట్రాలకూ లేఖ

జీఎస్టీ సవరణలకు మద్దతిచ్చిన అన్ని రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ లేఖ రాశారు. సంస్కరణలకు ఆమోదం తెలిపిన రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో తీవ్రమైన చర్చలు, వాదనలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయానికి రావడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆదాయ నష్టాలపై ఆందోళనలను పక్కనపెట్టి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడంలో జీఎస్టీ కౌన్సిల్ అద్భుతమైన పని తీరు కనబర్చిందని ప్రశంసించారు.

Next Story