రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

by Disha Web Desk 2 |
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేషన్ కార్డు దారులకు కేంద్ర సర్కార్ తీపి కబురు అందించింది. ఉచిత బియ్యం పథకంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ రేషన్ కార్డు హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్​న్యూస్ చెప్పింది. ఆహార భద్రత చట్టం కింద దేశంలో ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిసున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఛత్తీస్​గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోడీ ఈ ప్రకటన చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలు ప్రయోజనం పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 కరోనా సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన(పీఎంజీకేఏవై) స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న పేదలందరికీ ఉచిత రేషన్ బియ్యం అందిస్తోంది.

అయితే, మొదట ఈ స్కీమ్‌ను రెండు సంవత్సరాల వరకు కొనసాగించాలని కేంద్రం భావించింది. కానీ, 2022 డిసెంబర్ 31న నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎఫ్ఎస్ఏ)లో దీన్ని వీలినం చేసింది. దాంతో అప్పటి నుంచి ఆహార భద్రత కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ ఈ ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని కేంద్ర సర్కార్ కొనసాగిస్తోంది. 2020లో ప్రారంభమైన ఈ స్కీమ్‌ను ఇప్పటికే పలుమార్లు కేంద్రం పొడిగించింది. అయితే ఈ ఏడాది డిసెంబర్‌తో ఈ ఉచిత రేషన్ స్కీమ్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ మరోసారి ఫ్రీ రేషన్‌ను ఇంకో ఐదు సంవత్సరాల పాటు కొనసాగించనున్నట్లు మోడీ ప్రకటించారు. దీంతో జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఇంకో ఐదేళ్లు పేదలందరికీ రేషన్ బియ్యం ఉచితంగానే అందనున్నాయి. అంటే 2028 డిసెంబర్ వరకు కేంద్రం ఈ స్కీమ్ కింద ఉచితం రేషన్ బియ్యం పంపిణీ చేయనుంది. అయితే ఎన్ఎఫ్ఎస్ఏ కింద గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం మంది ప్రయోజనం పొందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కొవిడ్ కంటే ముందు రేషన్ కార్డు ఉన్న వారికి కిలో బియ్యాన్ని సబ్సిడీ ధరతో రూ. 1-3 వరకు అందించేది. ఐదు కేజీల చొప్పు ఒక్కొక్కరికీ కేటాయించేది. అలాగే అంత్యోదయ అన్న యోజన(ఏఏవై) కుటుంబాలకు 35 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసేది. బియ్యంతో పాటు తృణ ధాన్యాలు, గోధుమలు రూ.1 నుంచి 3కే అధిక సబ్సిడీ రేటుకు కేంద్ర ఇచ్చేది. అయితే ఈ స్కీమ్ అమలులోకి వచ్చినప్పటినుంచి కేంద్రం ఒక్క పైసా కూడా తీసుకోకుండా పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తోంది.

Next Story