వ్యవస్థ ఇలాగే ఏడిస్తే... 'శ్రద్ధ'లు చస్తూనే ఉంటారు

by Disha Web Desk 7 |
వ్యవస్థ ఇలాగే ఏడిస్తే... శ్రద్ధలు చస్తూనే ఉంటారు
X

న్యూఢిల్లీ: మన వ్యవస్థ ఇలాగే నడుస్తున్నంత కాలం దేశంలో శ్రద్ధావాకర్ లాంటి అమ్మాయిలు నిత్యం చనిపోతూనే ఉంటారని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సహజీవనం చేస్తున్న ప్రియుడు అఫ్తాబ్ తనను నరికి చంపుతాడు అంటూ రెండేళ్ల క్రితమే శ్రద్దావాకర్ మహారాష్ట్ర పోలీసులకు రిపోర్ట్ చేస్తే దానికి అతీగతీ లేకుండా పోయిందని చెప్పారు. అప్తాబ్ తనను గొంతునులిమి చంపి, ముక్కలుగా నరుకుతానని బెదిరిస్తున్నాడని 2020 నవంబర్ 23న శ్రద్దావాకర్ ముంబైలోని పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేసింది. ఆరోజు కూడా అప్తాబ్ తనను చంపడానికి ప్రయత్నించాడని పేర్కొంది. ఆమె రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు పత్రం బుధవారం వెలుగులోకి వచ్చింది. సంచలనం కలిగించిన ఈ ఫిర్యాదుపత్రం వెల్లడిపై స్వాతి మలివాల్ తీవ్రంగా స్పందించారు. పోలీసులు రెండేళ్లుగా ఎందుకు చర్యతీసుకోలేదు, మన వ్యవస్థ పనితీరు ఇలా ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. దేశంలో మన వ్యవస్థ ఇలాగే కొనసాగితే శ్రద్ధా వంటి అమ్మాయిలు ఇలాగే హత్యలకు గురై కడతేరిపోతుంటారని స్వాతి వ్యాఖ్యానించారు.

(('అఫ్తాబ్ తనను దూషిస్తూ వస్తున్నాడు, కొడుతున్నాడు, ఈరోజు కూడా అతడు నా గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. ఏదో ఒక రోజున నన్ను చంపి తీరుతానని అనేక సార్లు బెదిరించాడు. బ్లాక్‌మెయిల్ చేశాడు, ఆరునెలలుగా అతడు నన్ను హింసిస్తున్నాడు. కానీ చంపేస్తానని బెదిరించడంతో నేను పోలీసు స్టేషన్‌కి వెళ్లే ధైర్యం చేయలేకపోయాను' అని శ్రద్ధ తన ఫిర్యాదు పత్రంలో పేర్కొంది. అప్తాబ్ తల్లిదండ్రులకు ఈ మొత్తం విషయం తెలుసని చెప్పింది. వారి ఆశీర్వాదాలతో తామిరువురం పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే సహజీవనం చేస్తున్నాము. కానీ అతడు నిత్యం హింసిస్తుండటంతో అతడితో కలిసి జీవించడానికి ఇప్పుడు ఇష్టపడటం లేదని శ్రద్ధ తన ఫిర్యాదు పత్రంలో రాసింది.))

కేసు అప్పట్లోనే మూసేశాం.. మహా పోలీసులు

కాగా శ్రద్ద రాసిన ఫిర్యాదు పత్రం చూశానని, దాంట్లో కలవరపర్చే అంశాలున్నాయని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. పోలీసులు సకాలంలో ఎందుకు స్పందించలేదనే అంశంపై విచారణ సాగిస్తామన్నారు. అయితే శ్రద్ధ తన ఫిర్యాదు పత్రాన్ని వెనక్కు తీసుకోవడంతో అప్పట్లోనే కేసు మూసేశామని మహారాష్ట్ర పోలీసులు వివరణ ఇచ్చారు. అప్తాబ్‌కు తనకు మధ్య వివాదాలు సమసిపోయాయని ఆమె రాతపూర్వకంగా తెలిపిందని చెప్పారు.


Next Story

Most Viewed