Maharashtra: మహారాష్ట్రలోని ప్రైవేట్ స్కూల్లో బాలికలను అవమానించిన ప్రిన్సిపల్

by S Gopi |

కొందరు బాలికలు రుతుస్రావం లేదని చెప్పినప్పటికీ, ప్రిన్సిపల్ ఆదేశాలకు అనుగుణంగా ప్యూన్ వారిని తనిఖీ చేసింది.

Maharashtra: మహారాష్ట్రలోని ప్రైవేట్ స్కూల్లో బాలికలను అవమానించిన ప్రిన్సిపల్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో అమానవీయమైన ఘటన చోటుచేసుకుంది. పాఠశాల బాత్‌రూమ్‌లో రక్తపు మరకలు కనిపించిన కారణంగా స్కూల్ ప్రిన్సిపల్ తీరు ఇప్పుడు విమర్శలకు దారితీసింది. షాహాపూర్ ప్రాంతంలోని ఆర్ ఎస్ దమాని పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. 5 నుంచి 10 తరగతుల విద్యార్థినులను రుతుక్రమంలో ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు బలవంతంగా బట్టలు విప్పి తనిఖీ చేయించారు. కొందరు బాలికలు రుతుస్రావం లేదని చెప్పినప్పటికీ, ప్రిన్సిపల్ ఆదేశాలకు అనుగుణంగా ప్యూన్ వారిని తనిఖీ చేసింది. బలవంతంగా వారి బట్టలు విప్పించి, తనిఖీ పేరుతో మహిళా అటెండర్ వారి ప్రైవేట్ భాగాలను తాకుతూ ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. ఇది బాలికల తల్లిదండ్రులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. వారంతా పాఠశాల ఆవరణలో నిరసన తెలపడమే కాకుండా యాజమాన్యంతో పాటు ఈ సంఘటనలో భాగమైన ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రిన్సిపాల్, నలుగురు ఉపాధ్యాయులు, ఇద్దరు ట్రస్టీలు సహా ఎనిమిది మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రిన్సిపల్, ప్యూన్‌ను అరెస్ట్ చేసిన అనంతరం, మిగిలిన వారిపై విచారణ కొనసాగుతుందని మహారాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు.

Next Story