జయలలిత అక్రమార్జన కేసులో బెంగళూరు కోర్టు కీలక తీర్పు

by Dishanational1 |
జయలలిత అక్రమార్జన కేసులో బెంగళూరు కోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కేసులో కర్ణాటకలోని బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జయలలితకు సంబంధించిన 27 కిలోల బంగారం, వజ్రాభరణాలను ఈ ఏడాది మార్చి 6,7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. నిర్దేశించిన తేదీల్లో ఆభరణాలను తీసుకెళ్లడానికి ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వజ్రాభరణాలతో పాటు మొత్తం 700 కిలోల కంటే ఎక్కువ వెండిని కూడా ప్రభుత్వానికి అప్పగించనుంది. వీటిని తీసుకెళ్లేందుకు ఒక అధికారిని నియమించినట్టు కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ అధికారితో సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు స్థానిక పోలీసులతో భద్రతా ఏర్పాటు చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. స్వాధీనం సమయంలో ఫోటోలు, వీడియోలు, ఆరు ట్రంకు పెట్టెలు, అవసరమైన భద్రతతో రావాలని సూచించింది. తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో జయలలిత అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని ఆమె నివాసం నుంచి అధికారులు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ కేసులో జయలలిత దోషిగా తేలడం, బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించడం జరిగింది. అలాగే, రూ. 100 కోట్ల జరిమానా కూడా. ఆ తర్వాత జయలలిత మరణించడంతో దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి తిరిగివ్వాలని నిర్ణయించింది.


Next Story