Gaurav Gogoi: అసోం కాంగ్రెస్ చీఫ్‌గా గౌరవ్ గొగోయ్‌.. ప్రకటించిన ఏఐసీసీ

by B.Srinivas |

వచ్చే ఏడాది అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

Gaurav Gogoi: అసోం కాంగ్రెస్ చీఫ్‌గా గౌరవ్ గొగోయ్‌.. ప్రకటించిన ఏఐసీసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాది అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత గౌరవ్ గొగోయ్‌ను (Gaurav Gogoi) నియమించింది. భూపేన్ కుమార్ బోరా స్థానంలో గొగోయ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (Venugopal) సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గొగొయ్‌తో పాటు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు జాకీర్ హుస్సేన్ సిక్దార్, రోస్లినా టిర్కీ, ప్రదీప్ సర్కార్‌లను కూడా నియమించినట్టు తెలిపారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. తన నియామయంపై గొగొయ్ స్పందించారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge), లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ , రాష్ట్ర ఇన్‌చార్జ్ జితేంద్ర సింగ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్ అందించడానికి కృషి చేస్తానని తెలిపారు.

కాగా, గొగోయ్ ప్రస్తుతం రాష్ట్రంలోని జోర్హాట్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు కూడా ఆయన కలియాబోర్ లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే గొగోయ్ భార్యకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని అసోం హిమంత బిస్వశర్మ ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఈ నియామకం జరగడం గమనార్హం.

Next Story