అత్యంత అలసిపోయిన సీఎం నితీశ్ : తేజస్వి

by Dishanational4 |
అత్యంత అలసిపోయిన సీఎం నితీశ్ : తేజస్వి
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘బిహార్ మహాకూటమి నుంచి నితీశ్ వైదొలిగారు. అసలు ఆట ఇప్పుడే మొదలైంది. మేం గతం గురించి అస్సలు ఆలోచించం’’ అని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీకి నా శుభాకాంక్షలు. నితీశ్ కుమార్ పార్టీని వాళ్ల వెంట తీసుకెళ్లినందుకు బీజేపీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని ఆయన తెలిపారు. ‘‘నితీశ్ కుమార్ బహుశా అటూఇటూ దూకిదూకి అలసిపోయి ఉంటారు. ఆయన అత్యంత అలసిపోయిన సీఎం. ప్రభుత్వంలో ఉన్నన్ని నాళ్లు మేం నితీశ్‌ను గౌరవించాం. నేను ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు’’ అని తేజస్వి తెలిపారు. ‘‘నేను చెప్పేది గుర్తుంచుకోండి. ఈ ఏడాది ముగిసేలోగా నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఖేల్ ఖతమవుతుంది. వాళ్లు ఏం చేసినా బిహార్ ప్రజానీకమంతా మా వెంటే ఉన్నారు’’ అని ఆయన స్పష్టం చేశారు. నితీష్ కుమార్‌కు రాజకీయ భవితవ్యంపై ఎలాంటి విజన్ లేదని ఎద్దేవా చేశారు. ‘‘ఉపాధి అవకాశాలను కల్పించడం అసాధ్యమని నితీశ్ పదేపదే చెబుతుండేవారు. కానీ మేం రాష్ట్ర ప్రభుత్వంలో చేరిన తర్వాత దాన్ని సాధ్యం చేసి చూపించాం. గత 17 నెలల్లో ఆర్జేడీ ఎమ్మెల్యేలు చేపట్టిన మంత్రిత్వ శాఖల పరిధిలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలిచ్చాం. కచ్చితంగా ఆ క్రెడిట్‌ మాదే’’ అని తేజస్వి వివరించారు.



Next Story

Most Viewed