పరీక్షకు ముందే 'నీట్' పేపర్ అవుట్!

by Naga Rani Yarlagadda |

నీట్ యూజీ పరీక్షలో మరోసారి అవకతవకలు వెలుగుచూశాయి. 2024 పేపర్ లీక్ వివాదం సృష్టించిన ప్రకంపనలు మరువకముందే, తాజాగా 2026 పరీక్షలోనూ భారీ మోసం జరిగినట్లు రాజస్థాన్ పోలీసులు గుర్తించారు.

పరీక్షకు ముందే నీట్ పేపర్ అవుట్!
X
  • 140 ప్రశ్నలు లీక్.. క్వశ్చన్ ఆర్డర్ కూడా మారలేదు!
  • రూ.5 లక్షల దాకా విక్రయించిన వైనం
  • కేరళ విద్యార్థి ప్రమేయంపై పోలీసుల ఆరా
  • దర్యాప్తు జరుగుతోంది.. వదంతులు నమ్మొద్దు: ఎన్‌టీఏ

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్ యూజీ పరీక్షలో మరోసారి అవకతవకలు వెలుగుచూశాయి. 2024 పేపర్ లీక్ వివాదం సృష్టించిన ప్రకంపనలు మరువకముందే, తాజాగా 2026 పరీక్షలోనూ భారీ మోసం జరిగినట్లు రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లోని సీకర్ పట్టణంలో పరీక్షకు రెండు రోజుల ముందే గెస్ పేపర్ పేరుతో అసలు ప్రశ్నపత్రం విద్యార్థుల చేతుల్లోకి చేరినట్లు విచారణలో తేలింది. విస్మయకరమైన విషయం ఏమిటంటే మే 3న జరిగిన పరీక్షకు సంబంధించిన 140 ప్రశ్నలు, వాటి ఆప్షన్లు, చివరికి ప్రశ్నల క్రమం కూడా ఈ గెస్ పేపర్‌లో ఏమాత్రం తేడా లేకుండా ఉండటం గమనార్హం. ఇదే ఇప్పుడు పేపర్ లీక్ అయ్యిందనడానికి బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది.

లక్షల్లో చేతులు మారిన వైనం..

ఈ ప్రశ్నపత్రం విక్రయాల్లో భారీగా నగదు చేతులు మారినట్లు సమాచారం. పరీక్షకు రెండు రోజుల ముందు ఈ పేపర్‌ను ఒక్కొక్కరికి రూ. 5 లక్షలకు విక్రయించగా, పరీక్షకు ముందు రోజు రాత్రి డిమాండ్‌ను బట్టి రూ. 30 వేలకే అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చేతిరాతతో ఉన్న ఈ ప్రశ్నల జాబితా సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. ఈ కుంభకోణం వెనుక అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు.. సీకర్ పట్టణంలోని పలు కోచింగ్ సెంటర్లు, పీజీ హాస్టళ్ల యజమానులను విచారిస్తున్నారు.

కేరళ విద్యార్థి ద్వారానే లీక్?

ఈ కేసులో కేరళకు చెందిన ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ప్రమేయంపై పోలీసులు దృష్టి సారించారు. ఆ విద్యార్థి మే 1న సీకర్‌లోని తన స్నేహితుడికి ఒక మెటీరియల్ ఇచ్చాడని, అది పీజీ వసతిగృహాలు, కౌన్సెలర్లు, కోచింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా అభ్యర్థులకు చేరిందని పోలీసులు గుర్తించారు. ఆ మెటీరియల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుల వాట్సాప్ చాట్లు, కాల్ డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఎన్‌టీఏ స్పందన.. ఆందోళన వద్దు

ఈ వివాదంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పందించింది. అవకతవకలపై వస్తున్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని, పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ సమాచారం అందిందని తెలిపింది. పోలీసులకు తాము పూర్తి సహకారం అందిస్తున్నామని, పారదర్శకంగా విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. మే 10న విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌లో.. పరీక్ష నిర్వహణ, ఫలితాల విషయంలో విద్యార్థులు ఆందోళన చెందవద్దని, వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు వదంతులను నమ్మవద్దని ఎన్‌టీఏ కోరింది.

Next Story