ప్రధాని మోడీ ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత్ దాస్

by Ajay Maddhiboyina |

క్తికాంత్ దాస్ ఒడిషాలోని భువనేశ్వర్‌లో 1957 ఫిబ్రవరి 26న జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ పొందారు.

ప్రధాని మోడీ ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత్ దాస్
X

- గతంలో ఆర్బీఐ గవర్నర్‌గా పని చేసిన దాస్

- రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత్ దాస్‌ను నియమించారు. గతంలో ఆర్బీఐ గవర్నర్‌గా పని చేసిన శక్తికాంత్ దాస్‌ను ప్రధాని రెండో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శక్తికాంత్ దాస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన నియామకం అమలులోకి వస్తుంది. ప్రధాన మంత్రి మోడీ టర్మ్ ముగిసే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు శక్తి కాంత్ దాస్ పదవిలో ఉంటారని నియామకపు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ఇప్పటికే ప్రధాని మోడీకి ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన 2019 సెప్టెంబర్ 11 నుంచి ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు శక్తికాంత్ దాస్ రెండో ముఖ్య కార్యదర్శిగా ఉండనున్నారు.

శక్తికాంత్ దాస్ ఒడిషాలోని భువనేశ్వర్‌లో 1957 ఫిబ్రవరి 26న జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత యూపీఎస్సీ రాసి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 1980వ బ్యాచ్ తమిళనాడు కేడర్‌కు చెందిన శక్తికాంత్ దాస్ కేంద్రం, తమిళనాడు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పని చేశారు. 2018 డిసెంబర్‌లో శక్తికాంత్ దాస్ 25వ ఆర్బీఐ గవర్నర్‌గా నియమించబడ్డారు. ఆర్థికంగా మార్కెట్లు కీలకమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో శక్తికాంత్ దాస్ ఆర్బీఐ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఫైనాన్స్ సెక్టార్ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. దేశంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న సమయంలో స్థిరత్వాన్ని తీసుకొని రావడంలో శక్తికాంత్ దాస్ సఫలమయ్యారు. ఇక కోవిడ్-19 పాండమిక్, అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల సమయంలో శక్తికాంత్ దాస్ సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు.

గతేడాది డిసెంబర్‌లో శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్‌గా రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన సంజయ్ మల్హోత్రాను ఆర్బీఐ గవర్నర్‌గా ప్రభుత్వం నియమించింది. కాగా, 2021లో ఉత్కల్ యూనివర్సిటీ శక్తికాంత్ దాస్‌కు డాక్టరేట్ పట్టాను ఇచ్చింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో దాస్ సేవలకు గుర్తింపుగా ఈ పట్టాను అందించింది.

Next Story