మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడిపై కోడిగుడ్లతో దాడి.. చోర్.. చోర్ అంటూ నినాదాలు

by Ramesh Naini |

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. సోనార్‌పూర్‌లో పర్యటిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం ఊహించని రీతిలో దాడి జరిగింది.

మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడిపై కోడిగుడ్లతో దాడి.. చోర్.. చోర్ అంటూ నినాదాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. సోనార్‌పూర్‌లో పర్యటిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం ఊహించని రీతిలో దాడి జరిగింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతర హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై కొందరు స్థానికులు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు. భౌతికంగా దాడి చేసేందుకు కూడా ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆయన హెల్మెట్ ధరించి బాధితుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

బీజేపీ ఆందోళన - నినాదాలు..

అదే సమయంలో అక్కడ భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఆయనను ముట్టడించే ప్రయత్నం చేస్తూ, ‘దొంగ.. దొంగ’ (చోర్.. చోర్) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీలో నంబర్-2గా పరిగణించే నేతపై నడిరోడ్డుపై దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీఎంసీ, బీజేపీ శ్రేణుల పోటాపోటీ చర్యలతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనతో బెంగాల్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరింది.

Next Story