అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్..

by Disha Web Desk 12 |
అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్న కొద్ది.. ఆ రాష్ట్రంలోని వివిధ పార్టీల నేతల రాజీనామాలు సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఈ రాజీనామాల బెడద ఎక్కువగా ఉంది. బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో యాక్టీవ్‌గా వర్క్ చేయని నేతలకు ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరిస్తుంది. ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌కు టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. "వారు నన్ను విస్మరించిన తీరుపై నేను కలత చెందాను, నేను నిశ్శబ్దంగా కూర్చోకూడదని భావించాను. నేను వారిని సవాలు చేయాలి" అని లింగాయత్ నాయకుడు షెట్టర్ అన్నారు. భారమైన హృదయంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం బసవరాజు బొమ్మైకు అందించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శెట్టర్ మే 10న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్బళ్లి- ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నుంచి టిక్కెట్‌ను ఆశించారు. అయితే అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్ గత అర్థరాత్రి వరకు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు.

కానీ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్టాండ్‌పై గట్టిగా నిలబడ్డారు. కొద్ది రోజుల నుంచి బీజేపీ నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరు తనకు అవమానకరమని అన్నారు. పార్టీ నేతలు తనను కించపరిచినందువల్లే తాను రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నానని శెట్టర్ అన్నారు. శెట్టర్ నిర్ణయం బీజేపీకి తీవ్ర నష్టం కలిగిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కాగా, శెట్టర్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో చేరనున్నట్లు సమాచారం.


Next Story