డబుల్ డెక్కర్ బస్సులో అగ్నిప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-15 13:24:23  IST  )

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లక్నోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

డబుల్ డెక్కర్ బస్సులో అగ్నిప్రమాదం..  ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) రాష్ట్రంలోని లక్నోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం మొహన్‌లాల్‌గంజ్ సమీపంలోని కిసాన్‌పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్‌ (Double decker) బస్సులో అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అలాగే, తెల్లవారుజామున కావటంతో ప్రయాణికులలో చాలా మంది నిద్రలో ఉన్నారు.

అయితే, బస్సులో అకస్మాత్తుగా పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు, ప్రయాణికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అయితే, డ్రైవర్ కేబిన్ వద్ద అదనంగా సీటు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బస్సులోని ముందు వైపు ప్రయాణికులు బయటికి రాగలిగారు. కానీ బస్సు ఎమర్జెన్సీ గేట్ పనిచేయకపోవడం వల్ల వెనుక కూర్చున్న ప్రయాణికులు బయటికి రాలేకపోయారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. అగ్ని ప్రమాదం మొదలైన 10 నిమిషాల్లోనే మొత్తం బస్సు పూర్తిగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో డ్రైవర్, కండక్టర్ బస్సు నుంచి దూకి పరారయ్యారు. ఆరు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story