టేకాఫ్ విమానం ఇంజిన్లో మంటలు.. ప్రయాణికులకు గాయాలు

by Naga Rani Yarlagadda |

టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ఇంజిన్లో మంటలు చెలరేగడం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ప్రయాణికులు భయంతో వణికిపోయారు.

టేకాఫ్ విమానం ఇంజిన్లో మంటలు.. ప్రయాణికులకు గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ కావాల్సిన విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు వెళ్లాల్సిన స్విస్ (SWISS) ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై పరుగులు తీస్తోంది. సరిగ్గా టేకాఫ్ అయ్యే తరుణంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేయడంతో పెను ముప్పు తప్పింది.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 232 మంది ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను విమానం నుంచి కిందికి దించేందుకు అధికారులు ఎమర్జెన్సీ స్లైడ్‌లను ఉపయోగించారు. ఈ క్రమంలో కిందకు దిగుతుండగా ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

విమాన ప్రయాణం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు వసతి కల్పించారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఎయిర్‌పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.

Next Story