Lockup Death Case : తండ్రీకొడుకుల లాకప్‌ డెత్‌ కేసు.. 9 మంది పోలీసులకు మరణశిక్ష

by Ramesh Naini |

ఆరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తమిళనాడులోని తండ్రీకొడుకుల లాకప్‌ డెత్‌ కేసులో మదురై కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.

Lockup Death Case : తండ్రీకొడుకుల లాకప్‌ డెత్‌ కేసు.. 9 మంది పోలీసులకు మరణశిక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తమిళనాడులోని తండ్రీకొడుకుల లాకప్‌ డెత్‌ కేసులో మదురై కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. కస్టడీలో ఉన్న తండ్రీకొడుకుల మృతికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. 2020 జూన్ 19న కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ షాపు తెరిచారనే ఆరోపణలతో వ్యాపారి పి. జయరాజ్, అతడి కుమారుడు జె. బెనిక్స్‌లను తూత్తుకుడి జిల్లా సత్తాంకుళం పోలీసులు (Sathankulam police station) అరెస్ట్ చేశారు. స్టేషన్‌లో రాత్రంతా వారిని పాశవికంగా చిత్రహింసలకు గురిచేయడంతో, తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో షాప్ తెరిచారనేది అబద్దమని విచారణలో తేలింది.

మహిళా కానిస్టేబుల్ కీలక వాంగ్మూలం..

దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనలు, మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ ఘటనలో పాలుపంచుకున్న ఒక ఇన్స్‌పెక్టర్, ఇద్దరు ఎస్సైలతో సహా 10 మంది పోలీసులను అరెస్ట్ చేసి హత్య కేసులు నమోదు చేసింది. తండ్రీకొడుకులను రాత్రంతా దారుణంగా కొట్టారని, బల్లలు, లాఠీలపై రక్తపు మరకలు ఉన్నాయని ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. అలాగే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సత్తాంకుళం పోలీసులు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని సైతం మాయం చేసినట్లు సీబీఐ విచారణలో నిర్ధారణ అయింది. సుదీర్ఘ విచారణ అనంతరం సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఈ దారుణానికి పాల్పడిన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఖరారు చేసింది.

Next Story