ఘోర రోడ్డు ప్రమాదం: ఆగివున్న బస్సును ఢీకొట్టిన క్యాంటర్ ట్రక్.. ఐదుగురు దుర్మరణం

by Malleboina Mahesh |

యూపీలోని ఏటా జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగివున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టిన వేగంగా వచ్చిన ట్రక్.. ఐదుగురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు!

ఘోర రోడ్డు ప్రమాదం: ఆగివున్న బస్సును ఢీకొట్టిన క్యాంటర్ ట్రక్.. ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న ఓ ట్రక్.. ఆగి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఏటా (Etah) జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏటా-అలీగంజ్ రోడ్డు మార్గంలో ప్రయాణికులతో నిలిచి ఉన్న ఉత్తర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (UPSRTC) కి చెందిన ప్రభుత్వ బస్సును.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక క్యాంటర్ ట్రక్ (Canter Truck)ను బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అతివేగమే ప్రమాదానికి కారణం

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పక్కన బస్సు ఆగి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్యాంటర్ ట్రక్ డ్రైవర్ మితిమీరిన వేగంతో, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే బస్సును వెనుక నుంచి అంత బలంగా ఢీ కొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 11 మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story