‘వోకల్ ఫర్ లోకల్’ సహా 5 సంకల్పాలు పాటించండి.. అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని మోడీ పిలుపు

by Malleboina Mahesh |

అమరనాథ్ యాత్ర సందర్భంగా 'వోకల్ ఫర్ లోకల్', స్వచ్ఛత సహా 5 సంకల్పాలు పాటించాలని, వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

‘వోకల్ ఫర్ లోకల్’ సహా 5 సంకల్పాలు పాటించండి.. అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని మోడీ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి పవిత్ర అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభమైన సందర్భంగా దేశవిదేశాల నుంచి తరలివస్తున్న శివభక్తులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ప్రత్యేకంగా లేఖ రాశారు. బాబా బర్ఫానీ పవిత్ర దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితంలో మరచిపోలేని ఆధ్యాత్మిక అనుభవమని పేర్కొంటూ యాత్రికులందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అమర్‌నాథ్ యాత్ర భారతదేశ సాంస్కృతిక ఐక్యతకు, భిన్నత్వంలో ఏకత్వానికి సజీవ నిదర్శనమని కొనియాడారు. కఠినమైన వాతావరణంలోనూ భక్తులకు రక్షణ కల్పిస్తున్న భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ-కశ్మీర్ పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పౌరుల నిస్వార్థ సేవాభావాన్ని ప్రధాని అభినందించారు.

ఈ సందర్భంగా యాత్రకు వెళ్తున్న భక్తులందరూ దేశ శ్రేయస్సును కాంక్షిస్తూ ఐదు ముఖ్యమైన సంకల్పాలను (Five important resolutions) పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. యాత్రా మార్గంలో పారిశుధ్య నియమాలను పాటిస్తూ స్వచ్ఛతను కాపాడటం, భద్రతా సిబ్బంది సూచనలను గౌరవించడం మొదటి రెండు సంకల్పాలుగా పేర్కొన్నారు. స్థానిక యువత ఉపాధిని దెబ్బతీసేలా కాకుండా 'వోకల్ ఫర్ లోకల్' భావనతో భక్తులు తమ యాత్ర ఖర్చులో కనీసం 10 శాతం నిధులను జమ్మూ-కశ్మీర్ ఉత్పత్తుల కొనుగోలుకే కేటాయించాలని కోరారు. రక్షాబంధన్ నాటికి యాత్ర ముగిసే వేళ 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా తోబుట్టువులకు మొక్కలను బహుమతిగా ఇవ్వాలని, 'నేషన్ ఫస్ట్' భావనతో ప్రతి ఒక్కరు విధులను నిర్వర్తిస్తూ 'వికసిత భారత్' నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

Next Story