కేరళలో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరి మృతి, 26 మందికి పైగా గాయాలు!

by Ramesh Naini |

కేరళలోని మలప్పురం జిల్లా కుట్టిపురం వద్ద జాతీయ రహదారి-66పై ఆదివారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది.

కేరళలో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరి మృతి, 26 మందికి పైగా గాయాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళలోని మలప్పురం జిల్లా కుట్టిపురం వద్ద జాతీయ రహదారి-66పై ఆదివారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్-కోజికోడ్ మార్గంలో ప్రయాణిస్తున్న ‘డిఫెండర్’ అనే ప్రైవేట్ లిమిటెడ్ స్టాప్ బస్సు వర్షం కారణంగా నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, 26 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. ఉదయం 11 గంటల ప్రాంతంలో కైలాస్ ఆడిటోరియం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వర్షంతో తడిసిన రోడ్డుపై వేగంగా వస్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి సుమారు 25 మీటర్ల మేర జారుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో ఒక ఆటోరిక్షాను, డివైడర్‌ను ఢీకొట్టి, గతంలో ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారుపై బోల్తా పడింది.

సహాయక చర్యలు..

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు విడిభాగాలను కట్ చేసి లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే కుట్టిపురం, వలంచేరి, కొట్టక్కల్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

వైరల్ వీడియో..

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బస్సు అతివేగంగా వచ్చి బోల్తా పడటం, దుమ్ము, పొగ వ్యాపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై కేరళ రవాణా శాఖ మంత్రి సి.పి. జాన్ స్పందిస్తూ.. బస్సు అతివేగమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

Next Story