కారును ఢీ కొట్టి లోయలో పడ్డ స్లీపర్ బస్సు.. ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మృతి!

by Malleboina Mahesh |

కారును ఢీకొట్టి బస్సు లోయలో పడిటంతో ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు కారు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందిన షాకింగ్ సంఘటన ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై చోటు చేసుకుంది.

కారును ఢీ కొట్టి లోయలో పడ్డ స్లీపర్ బస్సు.. ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మృతి!
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వెళ్తున్న స్లీపర్ బస్సు కారును ఢీ కొట్టి లోయలో పడిపోయింది. దీంతో ఐదుగురు తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా పరిధిలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున సంభవించింది. హర్యానాలోని ఝజ్జర్ నుండి బిహార్‌లోని నలందాకు వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు.. బాంగర్‌మౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైల్‌స్టోన్ 230 వద్ద ముందు వెళ్తున్న ఎర్టిగా (Ertiga) కారును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు నియంత్రణ కోల్పోయి ఎక్స్‌ప్రెస్‌వే రక్షణ రైలింగ్‌ను ముక్కలు చేసుకుంటూ రోడ్డు పక్కన ఉన్న లోయ లాంటి గుంతలోకి దూసుకెళ్లి తలకిందులుగా పడిపోయింది.

కారులోని ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం..

తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో బస్సు అతివేగంగా కారును ఢీకొట్టడమే కాకుండా దాదాపు 20 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ కారు పూర్తిగా నలిగిపోవడంతో.. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్న పిల్లలు సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను వినోద్ (45-డ్రైవర్), ధున్‌మున్ (60), అంజు (40) ఇద్దరు బాలికలు దివ్య (6), అమృత (13) గా పోలీసులు గుర్తించారు.

డ్రైవర్ నిద్రమత్తే కారణం.. ఎనిమిది మందికి గాయాలు..

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు గుంతలో పడటంతో అందులోని నలుగురు ప్రయాణికులతో పాటు కారులోని మరో నలుగురు కలిపి మొత్తం ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. తెల్లవారుజామున బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని బాంగర్‌మౌ సర్కిల్ ఆఫీసర్ హర్ష్ మోదీ ప్రాథమిక విచారణలో వెల్లడించారు.

Next Story