మరో ప్రతిపక్ష నేతకు ఈడీ సమన్లు.. నేడు విచారణకు రావాలని ఆదేశాలు

by Dishanational5 |
మరో ప్రతిపక్ష నేతకు ఈడీ సమన్లు.. నేడు విచారణకు రావాలని ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర దర్యాప్తు సంస్థ ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్’(ఈడీ) మరో ప్రతిపక్ష నేతకు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్, ఎంపీ ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ బుధవారం నోటీసులు జారీచేసింది. జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలపై గురువారం విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. జేకే క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన నిధులు అసోసియేషన్ ఆఫీస్ బేరర్లతోపాటు పలువురి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ అయినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ.. ఆఫీస్ బేరర్లకు వ్యతిరేకంగా చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ చార్జిషీట్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగానే ఫరూక్ అబ్దుల్లాకు తాజా సమన్లు జారీచేసింది. కాగా, ప్రతిపక్ష నేతల్లో ఇప్పటికే భూ కుంభకోణం ఆరోపణలతో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తోపాటు, లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈడీ సమన్లను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.




Next Story

Most Viewed