Farmer: 20 ఎకరాల పంటను ధ్వంసం చేసిన ఆఫీసర్స్.. అక్కడిక్కడే కుప్పకూలిన రైతు

by B.Srinivas |

చేతికొచ్చిన పంటను అధికారులు ధ్వంసం చేయడంతో ఓ రైతు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

Farmer: 20 ఎకరాల పంటను ధ్వంసం చేసిన ఆఫీసర్స్.. అక్కడిక్కడే కుప్పకూలిన రైతు
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేతికొచ్చిన పంటను అధికారులు ధ్వంసం చేయడంతో ఓ రైతు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. సిరోంజ్ తహసీల్‌కు చెందిన మూల్‌చంద్ (Mool chandh) అనే రైతు కేతన్ ఆనకట్ట ప్రాంతంలో తన 20 ఎకరాల భూమిలో పంట పండిస్తున్నారు. అయితే ఆ భూమి ఆక్రమణకు గురైందని అది ప్రభుత్వానికి చెందినదిగా ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులు ట్రాక్టర్‌తో పంటను నాశనం చేశారు. రైతు మూల్ చంద్, ఆయన భార్య ఎంత వేడుకున్నప్పటికీ వినలేదు. దీంతో రైతు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అయినప్పటికీ ఆయనను పట్టించుకోకుండా అధికారులు అక్కడి వెళ్లి పోవడం గమనార్హం. అయితే స్థానిక రెవెన్యూ అధికారులు ఈ చర్యను సమర్థించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

అనంతరం రైతు మాట్లాడుతూ.. ‘నేను కష్టపడి పండించిన పంటపై ట్రాక్టర్ దూసుకెళ్లడం చూసి భరించలేకపోయా. ఈ క్రమంలోనే నాకు గుండెపోటు పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చేసరికి నా పంట నాశనమైంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబర్‌లో భూమికి రశీదు సైతం కట్టినట్టు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులపై దౌర్జన్యం చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. స్థానిక రైతులు సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలంలోనూ జరగని దారుణాలు బీజేపీ పాలనలో జరుగుతున్నాయని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ (Kamalnath) విమర్శించారు.

Next Story