భార్య రేప్-మర్డర్ కేసులో 12 ఏళ్ల తర్వాత భర్తకు ఊరట

by Ajay Maddhiboyina |

2013 ఫిబ్రవరిలో బెంగళూరులో ఒక మహిళ (43) రేప్, మర్డర్ కేసు సంచలనం సృష్టించింది.

భార్య రేప్-మర్డర్ కేసులో 12 ఏళ్ల తర్వాత భర్తకు ఊరట
X

- భర్తే నిందితుడని చెప్పిన పోలీసులు

- పోలీస్ రిపోర్టుతో జైలుకు వెళ్లిన భర్త

- కేసు రీఓపెన్ చేయాలని కోరిన భర్త

- రీఇన్వెస్టిగేషన్‌లో సంచనల నిజాలు

- భర్త సన్నిహితుల పనే అని తేల్చిన సాక్ష్యాలు

దిశ, నేషనల్ బ్యూరో:

భార్య దారుణంగా రేప్-మర్డర్‌కు గురవగా.. అది భర్తే చేశాడని చెప్పి పోలీసులు అతడిని జైలు పంపారు. ఒక వైపు భార్యను కోల్పోయిన దుఖం.. మరోవైపు చేయని తప్పుకు జైలుకు వెళ్లిన ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాను తప్పుచేయలేదని భర్త ఎంత మొత్తుకున్నా వినకుండా.. అతడే నేరానికి పాల్పడ్డాడంటూ పోలీసులు జైలుకు పంపి, కేస్ క్లోజ్ చేశారు. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా భర్త కేసును రీ ఓపెయిన్ చేయించి అసలైన నిందితులను పట్టించాడు. ఈ కేసులో 11 ఏళ్ల తర్వాత భర్తకు ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే.. 2013 ఫిబ్రవరిలో బెంగళూరులో ఒక మహిళ (43) రేప్, మర్డర్ కేసు సంచలనం సృష్టించింది. సదరు మహిళ ఒక రీసెర్చ్ ఫర్మ్‌లో పని చేస్తుండగా.. అతని భర్త ఒక బ్యాంకులో ఉద్యోగిగా ఉన్నాడు. ఆ ఏడాది ఫిబ్రవరి 12న భార్య ఆఫీసుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కంగారు పడి కాల్ చేశాడు. అయితే ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ రాయించాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16న ఆమె మృతదేహం బెంగళూరు-దొడ్డబల్లాపూర్ హైవే పక్కన ఉన్న యూకలిప్టస్ చెట్ల మధ్య పోలీసులు కనుగొన్నారు.

పోస్టుమార్టమ్‌లో సదరు మహిళలపై దారుణంగా లైంగిక దాడి జరిగిందని, ఆ తర్వాత హత్య చేసినట్లు నిర్దారణ అయ్యింది. అయితే పోలీసులు సదరు మహిళ ఇంటిని తనిఖీ చేసినప్పుడు రక్తపు మరకలను కనుగొన్నారు. 2015 మేలో ఫోరెన్సిక్ రిపోర్టులో ఆ రక్తపు మరకలు చనిపోయిన మహిళవే అని తేలింది. దీంతో భర్తే ఆ మహిళను ఇంట్లో చంపి, అక్కడ పడేశాడని పోలీసులు కంక్లూజన్‌కు వచ్చి అతనిపై మర్డర్, రేప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత కేసు క్లోజ్ చేశారు. అయితే భర్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు ఎలాంటి సాక్ష్యాధారాలు సమర్పించక పోవడంతో భర్తను 73 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల చేశారు. అయితే అప్పటికే పోలీసులు కేసు క్లోజ్ చేయడంతో భర్తకు ఏం చేయాలో పాలుపోలేదు.

కేసు రీఓపెన్ చేయించి..

తన భార్యపై దారుణంగా లైంగిక దాడి చేసి హత్య చేసిన విషయాన్ని భర్త జీర్ణించుకోలేక పోయాడు. వెంటనే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి తన భార్య రేప్-మర్డన్ కేసును రీఇన్వెస్టిగేషన్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. దీంతో కేసును రీఓపెన్ చేసి సీఐడీకి అప్పగించారు. అయితే కాల్ డీటైల్ రికార్డుల ద్వారా భర్త పని చేసిన బ్యాంకు మాజీ మేనేజర్ నర్సింహమూర్తి నుంచి మహిళకు 11 మెసేజ్‌లు వచ్చినట్లు గుర్తించారు. అంతే కాకుండా ఒకే నంబర్ నుంచి కొన్ని కాల్స్ కూడా వచ్చినట్లు తేలింది. దీంతో పోలీసులు మూర్తిని ప్రశ్నించారు. కాల్ డేటా, ఇతర ఆధారాలను సరి చూడగా మహిళ మృతదేహం లభించిన ప్రదేశానికి మూర్తి వెళ్లినట్లు తేలింది. కాగా, మహిళకు మూర్తి ఫ్రెండ్ దీపక్ చెన్నప్ప నుంచి కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఇదే కేసులో హరి ప్రసాద్ కూడా ఇన్వాల్వ్ అయినట్లు తేలింది.

2013 ఫిబ్రవరి 12న బాధితురాలిని మూర్తి తన కారులో రిక్రియేషనల్ క్లబ్‌కు తీసుకొని వెళ్లాడు. అక్కడే ఆమెను రేప్ చేసినట్లుగా తేలింది. మూర్తి, దీపక్, హరిప్రసాద్‌లు ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆమె పోలీసులకు చెబుతుందేమో అని హత్య చేసి.. యూకలిప్టస్ పొదల్లో పడేశారు. పోలీసులు కాల్ డేటా, బ్రెయిన్ మ్యాపింగ్ ఉపయోగించి నిందితులను పట్టుకోవడమే కాకుండా.. వారి నుంచి నిజాలను రాబట్టారు. దీంతో 12 ఏళ్ల తర్వాత భర్తకు అసలు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. భర్త సన్నిహితులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో సీఐడీ పోలీసులు 1277 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో 84 మంది సాక్ష్యుల వాంగ్మూలాలు కూడా నమోదు చేశారు.

Next Story