రిజర్వేషన్లు తీసేయమన్నా.. తీసేయం : అమిత్ షా

by Dishanational4 |
రిజర్వేషన్లు తీసేయమన్నా.. తీసేయం : అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు వ్యతిరేకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించాలని ఒకవేళ కాంగ్రెస్ భావించినా.. అందుకు తాము అనుమతించబోమని తేల్చి చెప్పారు. దీన్ని కూడా మోడీ గ్యారంటీగా భావించాలని ప్రజలను ఆయన కోరారు. రాజస్థాన్‌లోని కోటా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ అయిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని మోడీ ఓబీసీ వర్గానికి చెందినవారు. ఆ అభిమానంతోనే ఆయన వెనుకబడిన తరగతుల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు’’ అని కేంద్ర హోంమంత్రి తెలిపారు. దేశంలోని అన్ని కేంద్ర సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ‘‘మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. రిజర్వేషన్లపై పార్లమెంటులో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ తండ్రి దివంగత రాజీవ్ గాంధీ రెండున్నర గంటల పాటు మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు’’ అని అమిత్‌షా చెప్పారు. ‘‘మోడీ అధికారంలోకి రాకముందు దేశంలో కమ్మరి, టైలర్లు, వడ్రంగులు, పడవలు తయారు చేసే వారికి ఎలాంటి సంక్షేమ పథకమూ లేదు. ప్రధాని మోడీ రూ.13,000 కోట్లు వెచ్చించి వారికోసం నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పథకాలను తీసుకొచ్చారు’’ అని ఆయన తెలిపారు. ‘‘ఈవీఎంపై ఉన్న కమలం గుర్తు బటన్‌ను ఎంత గట్టిగా నొక్కాలంటే.. ఆ దెబ్బకు ఇటలీలో విద్యుత్ షాక్‌లు రావాలి’’ అని ఓటర్లకు అమిత్‌షా పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed